తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు 71వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు తదితరులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే తెలంగాణ భవన్లో నిర్వహించిన కేసీఆర్ జన్మదిన వేడుకలలో పాల్గొన్న కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి కేసీఆర్ కేవలం తనకు మాత్రమే హీరో కాదని, తెలంగాణ జాతి మొత్తానికి, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు హీరో అని ఎమోషనల్ అయ్యారు.
కేసీఆర్ కడుపున బిడ్డగా పుట్టటం తన పూర్వజన్మ సుకృతం అని, అదృష్టమని కేటీఆర్ అన్నారు. తెలంగాణకు విముక్తి కల్పించిన మహానుభావుడు కేసీఆర్ అని, ఆ కారణజన్ముడి కడుపున పుట్టటం అదృష్టమని చెప్పారు. ఎన్నో ప్రతికూల పరిస్థితులు, మరెన్నో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొని తెలంగాణ సాధించారని గతాన్ని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. మీడియా పవర్, మనీ పవర్, మజిల్ పవర్ , కుల బలం లేదని…గుండె బలం, జనబలంతోనే తెలంగాణ సాధించిన గొప్ప నేత కేసీఆర్ అని కొనియాడారు.
25 ఏళ్ల కిందట పార్టీ పెట్టారని, ఎన్నో ప్రతికూల పరిస్థితులు, మరెన్నో అవమానాలు ఎదుర్కొని ధైర్యంగా పోరాడి తెలంగాణ కలను ప్రజల తరపున స్వప్నించిన నేత కేసీఆర్ అని చెప్పారు. 25 ఏళ్లుగా రాష్ట్ర రాజకీయాలను శాసించి.. చావు నోట్లో తలపెట్టి తెలంగాణను సాధించిన కారణ జన్ముడు కేసీఆర్ అని ప్రశంసించారు. వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించకుండా తెలంగాణ సాధించిన కేసీఆర్ గర్వంగా పిలుచుకునే వ్యక్తి కావడమే తన లక్ష్యం అని అన్నారు. కేసీఆర్ వారసత్వానికి అర్హుడిగా ఉండటానికి ప్రతీక్షణం కృషి చేస్తానని కేటీఆర్ భావోద్వేగంగా మాట్లాడారు.
ఇక, కేసీఆరే మళ్లీ రావాలి, కేసీఆరే మళ్లీ సీఎం కావాలి అని ప్రజలు కోరుకుంటున్నారని, అదే లక్ష్యంగా బీఆర్ ఎస్ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. మూడున్నరేళ్లు కష్టపడి మళ్లీ బీఆర్ఎస్ ను అధికారంలోకి తెచ్చుకోవాలని పార్టీ శ్రేణులను కేటీఆర్ కోరారు.