జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్… శుక్రవారం రాత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలోని పలు రాష్ట్రాలకు సంబంధించి… ఇంచార్జీలను నియమిస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా తెలుగు నేలకు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కొప్పుల రాజుకు అవకాశం లభించింది.
పార్టీలో క్రియాశీలకంగానే ఉన్న రాజు ఇప్పటిదాకా తెర వెనుక ఉండే రాజకీయం చేశారు. అయితే తాజాగా రాహుల్ గాందీ నేతృత్వంలోని పార్టీ కీలక నేతలు కొప్పుల రాజుకు మరింత ప్రాధాన్యం ఇస్తూ… జార్ఖండ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీగా కీలక బాధ్యతలు అప్పగించారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు లోక్ సభ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రాజుకు 60 వేల ఓట్ల దాకా వచ్చాయి.
ఇదిలా ఉంటే… కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణకు కూడా పార్టీ ఇంచార్జీగా కొత్త నేతను నియమించారు. మొన్నటిదాకా టీపీసీసీ ఇంచార్జీగా దీపా దాస్ మున్షీ కొనసాగగా… ఇప్పుడు ఆమెను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. దీపా స్థానంలో మరో మహిళా నేతకు అవకాశం కల్పించారు.
మధ్య ప్రదేశ్ కు చెందిన మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ టీపీసీసీ నూతన ఇంచార్జీగా నియమితులు అయ్యారు. కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్ యూఐ అధ్యక్షురాలిగా, యూత్ కాంగ్రెస్ లో కీలక నేతగా వ్యవహరించిన మీనాక్షి… రాహుల్ గాంధీ కోర్ టీంలో కీలక నేతగా కొనసాగుతున్నారు.
తెలంగాణ పార్టీ వ్యవహారాలను దీపా సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నారన్న కారణంగానే ఆమెను తప్పించి… పార్టీ సంస్థాగత వ్యవహారాలపై మంచి పట్టు ఉన్న మీనాక్షికి తెలంగాణ బాధ్యతలు అప్పగించినట్లుగా సమాచారం. 2009 సార్వత్రిక ఎన్నికల్లో మధ్యప్రదేశ్ లోని మాండసోర్ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మీనాక్షి ఎంపీగా విజయం సాధించారు.
ఆ తర్వాత వరుసగా రెండు సార్లు అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె పరాజయం పాలయ్యారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ ఆమెను ఏఐసీసీ కార్యదర్శిగా నియమించి… తన కోర్ టీంలోకి తీసుకున్నారు.