తంతే వెళ్లి గారెల బుట్టలో పడ్డాడు రా అన్న సామెత ఆ ఏపీ మంత్రి విషయంలో నూటికి నూరు శాతం వర్తిస్తుంది. అసలు జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యేందుకు సంవత్సరాల తరబడి పోరాటాలు చేసే వాళ్ళు ఉంటారు. ఇక మంత్రి అయ్యేందుకు ఆరేడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారు ఎదురుచూపులు చూస్తూ ఉంటారు. అలాంటిది ఆ మంత్రికి ఎమ్మెల్యే టికెట్ రావటమే పెద్ద లక్ అనుకుంటే.. అనూహ్యంగా మంత్రి కూడా అయిపోయారు. అందువచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక తన రాజకీయ భవిష్యత్తును చేజేతులా పాడు చేసుకుంటున్నారా ? కనీసం పెర్ఫార్మన్స్ ఇవ్వలేకపోతున్నారా ? అంటే కూటమి ప్రభుత్వ వర్గాల్లో అవును అన్న చర్చలు వినిపిస్తున్నాయి. ఆ మంత్రి ఎవరో కాదు వాసంశెట్టి శుభాష్. ఏపీ కార్మిక శాఖ మంత్రి.
అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వైసీపీ నుంచి టిడిపిలో చేరి అనూహ్యంగా రామచంద్రపురం ఎమ్మెల్యే సీటు తెచ్చుకున్నారు. అమలాపురం కు చెందిన సుభాష్ వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న విశ్వరూప్ మీద పోరాటం చేశారు. సామాజిక సమీకరణల నేపథ్యంలో ఆయనకు పార్టీలో చేరిన వెంటనే అనూహ్యంగా రామచంద్రపురం టిడిపి టికెట్ దక్కింది. ఆయన ఎమ్మెల్యేగా గెలవడం సామాజిక సమీకరణల కోణంలో మంత్రి అయిపోవడం చకచక జరిగిపోయాయి. అయితే సుభాష్ తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవడమే తప్ప.. పార్టీలో, ప్రభుత్వంలో తన మార్కు చూపించలేకపోతున్నారనేది ప్రభుత్వ వర్గాలలో వినిపిస్తున్న టాక్.
ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల నమోదు విషయంలో ఆయన ఏమాత్రం సీరియస్ గా ఫోకస్ పెట్టలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు మందలించారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని 34 నియోజకవర్గాలలో అతి తక్కువ ఓట్లు నమోదు చేయించిన సెగ్మెంట్ రామచంద్రపురం అని చంద్రబాబు ప్రకటించారు. గ్రామ స్థాయి నాయకులు ఉండగానే రాజకీయాల్లో సీరియస్ ఉండాలంటూ ఆయనకు క్లాస్ పీకారు చంద్రబాబు. ఏదిఏమైనా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించు లేకపోతే ఎవరు ఏమీ చేయలేరు అన్న విషయాన్ని చంద్రబాబు చెప్పకనే చెప్పారు. తాజాగా మంత్రులకు ర్యాంకులు ప్రకటించారు. అందులో సుభాష్ ది చివరి స్థానం. సీఎం.. డిప్యూటీ సీఎంతో పాటు మొత్తం 25 మంది ఉన్న క్యాబినెట్లో సుభాష్ 25వ ర్యాంకులో ఉండడంతో పార్టీ, ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతుంది. తొలిసారి మంత్రి అయ్యే అవకాశం వస్తే దానిని సద్వినియోగం చేసుకుని దూసుకుపోవాలి.
శెట్టిబలిజ సామాజిక వర్గంలో తెలుగుదేశం పార్టీలోనే ఎంతోమంది ఉన్నా అనూహ్యంగా సుభాష్ కి ఎమ్మెల్యే సీటుతో పాటు మంత్రి పదవి వచ్చింది. సీనియర్లను కూడా సమన్వయం చేసి ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత సుభాష్ మీద ఉంది. కానీ అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. మంత్రి ఎందుకు సీరియస్ గా పని చేయలేకపోతున్నారు.. కార్మిక శాఖ పై పట్టు కోల్పోయారా ? అన్న చర్చలు కూడా వినిపిస్తున్నాయి. అసలు మంత్రికి వచ్చిన ఇబ్బంది ఏంటి ? అన్నది కూడా ఎవరికి అంతు పట్టడం లేదు. పరిస్థితి చేయి దాటితే సుభాష్ తీరు మార్చుకోకపోతే చంద్రబాబు ట్రీట్మెంట్ మరోలా ఉంటుందని కూడా పార్టీలో సీనియర్లు గుసగుసలాడుకుంటున్నారు. అన్ని సందర్భాలలో సామాజిక వర్గాలు ..సమీకరణలు వర్కౌట్ అవ్వవని .. ఫస్ట్ టైం మంత్రులైన మిగిలిన వారిని చూసిన సుభాష్ నేర్చుకోవాలని చర్చ జరుగుతుంది. మరి ఈ యంగ్ మినిస్టర్ ఎప్పటికైనా సీరియస్ గా పని చేస్తారో లేదో చూడాలి.