టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిజంగానే ఓ ట్రెండ్ సెట్టర్ అని చెప్పాలి. అదేదో సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ఫ్యాక్షన్ రాజకీయాలకు స్వస్తి పలికేందుకు ప్రత్యర్థులతో రాజీకి పయత్నిస్తే… అతడిని చూపించి టార్చ్ బేరర్ అంటే ఇలానే ఉంటాడంటూ సదరు సినిమాలోని ఓ పాత్ర అదిరేటి డైలాగ్ చెబుతుంది. అది సినిమా. ఏం చెప్పినా… ఏది చేయాలనుకున్నా జరిగిపోతుంది. నిజ జీవితంలో అయితే అలా కాదు కదా. అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే అకుంఠిత దీక్ష కావాలి. పట్టు వదలని కృషి దానికి తోడవ్వాలి. వాటికి అత్యంత కీలకమైన సమయం కూడా కావాలి. వీటిన్నింటినీ సమకూర్చుకుని లోకేశ్ నిజంగానే టార్చ్ బేరర్ లా నిలబడ్డారు. రాజకీయాల్లో ఉన్న వారందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆయా పార్టీలు తమ శ్రేణులను ఎంత బాగా చూసుకెోవాలో, ప్రతికూల పరిస్థితుల్లో పార్టీ శ్రేణులకు అండగా ఎలా నిలబడాలో చూపించారు.
2024 ఎన్నికలకు ముందు వైసీపీ పాలనలో టీడీపీ శ్రేణుల మీద పెద్ద ఎత్తున వేదింపులు జరిగాయి. దాడులు జరిగాయి. అవమానాలకు అయితే లెక్కే లేదని చెప్పాలి. టీడీపీ కార్యకర్తలు ఆస్తులు కోల్పోయారు. కొందరైతే ఏకంగా ప్రాణాలే కోల్పోయారు. మరికొందరు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశారు. అలాంటి పార్టీ శ్రేణులకు ఊరిపి ఊదే దిశగా లోకేశ్ కీలక అడుగు వేశారు. మనపై దాడులు, అకృత్యాలకు పాల్పడే వైసీపీ నేతలు, కేసులతొ వేధించే అధికారుల పేర్లను రాసుకునేందుకు ఓ రెడ్ బుక్ ను ఏర్పాటు చేసుకుందామని పిలుపు ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ రెడ్ బుక్ లోని వారి సంగతి తేలుద్దామని… అది కూడా చట్టబద్ధంగానే ఆ చర్యలు చేపడదామని అన్నారు.
లోకేశ్ నుంచి వినిపించిన ఈ మాట టీడీపీటో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. 2024 ఎన్నికల్లో పార్టీకి రికార్డు విక్టరీని అందించింది. అనుకున్నట్లుగానే… లోకేశ్ తన రెడ్ బుక్ ను ఓపెన్ చేసి వైసీపీ పాలనలో అరాచకాలకు పాల్పడ్డ వారిని వరుసబెట్టి చట్టం ముందు దోషులుగా నిలబెట్టే పనికి శ్రీకారం చుట్టారు. ఈ తరహా లోకేశ్ వ్యవహార సరళి… ఆయన చేతిలో చిత్తుగా ఓడిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కూడా ఆకట్టుకుంది. మీరు రెడ్ బుక్ రాస్తే… మేం వైట్ బుక్ రాస్తామంటూ ఆ మధ్య జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణుల నుంచి సెటైర్లు పేలాయి.
తాజాగా టీడీపీ అన్నా… ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నా..నారా లోకేశ్ అన్నా… నిత్యం విషం చిమ్మే తెలంగాణ విపక్ష పార్టీ బీఆర్ఎస్ కూడా ఇప్పుడు లోకేశ్ ను అనుసరిస్తోంది. లోకేశ్ నడిచిన బాటలోనే తామూ నడుస్తామంటూ చెబుతోంది. ఈ మేరకు లోకేశ్ రెడ్ బుక్ ను ప్రస్తావించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత తాము పింక్ బుక్ తెరుస్తామంటూ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ విపక్షాలపై దారుణాలకు పాల్పడుతోందని ఆరోపించిన కవిత… వాటన్నింటినీ రికార్డు చేసుకునేందుకు తాము కూడా లోకేశ్ మాదిరిగా పింక్ బుక్ ను రాస్తామని తెలిపారు. అంతేకాకుండా లోకేశ్ మాదిరిగానే…తాము అధికారంలోకి రాగానే తమ పింక్ బుక్ లో ఉన్న వారి సంగతి తేలుస్తామని హెచ్చరికలు జారీ చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates