ఢిల్లీ లిక్కర్ స్కాం రూ.2 వేల కోట్ల అయితే జగన్ ది రూ.20 వేల కోట్ల

ఏపీలో అధికార కూటమిలోని కీలక భాగస్వామి టీడీపీకి చెందిన యువ నేతలు ఒక్కొక్కరుగా ఆక్టివేట్ అయిపోతున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రిగా ఉన్న కింజరాపు రామ్మోహన్ నాయుడు ఓ రేంజిలో దూసుకుపోతున్నారు. ఇక నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా నిర్మాణాత్మకంగా సాగుతున్న తీరు వైరి వర్గాలను భయకంపితులను చేస్తోంది. తాజాగా వీరి బాటలోనే సానా సతీష్ రంగంలోకి దిగిపోయారు. వాస్తవానికి సానా సతీష్ కు రాజకీయాలు కొత్తేనని చెప్పాలి. మొన్నటిదాకా వ్యాపారాల్లో బిజీబిజీగా గడిపిన సానా.. ఇటీవలే టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. వచ్చిరావడంతోనే ఆయన తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో చురుగ్గా పాలుపంచుకొంటున్న సానా.. వైసీపీ ఎంపీలు చేస్తున్న దాడులను తిప్పికొడుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సానా ఓ రేంజిలో విరుచుకుపడ్డారు. వైసీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టుఫై గాని, వైజాగ్ స్టీల్ ప్లాంటుపై గాని ఏమాత్రం పట్టనట్టు వ్యవహరించిన మిథున్… ఇప్పుడే వాటిపై ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. గతంలో వైసీపీకి 22 మంది లోక్ సభ సభ్యులు ఉన్న అంశాన్ని ప్రస్తావించిన సానా…. అంత మంది ఎంపీలతో కూడా వైసీపీ ఏమీ సాధించలేక పోయిందని తూర్పారబట్టారు. అధికారంలో ఉండగా రాష్ట్ర బాగోగులు పట్టని మిథున్ కు ఇప్పుడే రాష్ట్రం గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు.

అనంతరం ఏపీలో వైసీపీ హయాంలో చోటుచేసుకున్న లిక్కర్ స్కాం గురించి సానా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో కేవలం రూ.2 వేల కోట్ల విలువ చేసే లిక్కర్ స్కాం జరిగితేనే సీఎం, డిప్యూటీ సీఎంలు అరెస్ట్ అయ్యారని సానా తెలిపారు. అదే ఏపీలో రూ.20 వేల కోట్ల మేర లిక్కర్ స్కాం జరిగిందన్న సానా.. అందులో ఎవరెవరు అరెస్ట్ అవుతారన్నది త్వరలోనే తేలుతుందన్నారు. ఏపీ లిక్కర్ స్కాములో మిథున్ రెడ్డికి పాత్ర ఉందని కూడా సానా సంచల ఆరోపణ చేశారు. తానూ చేసిన స్కాం లు బయటకు రాకుండా ఉండేలా మిథున్ ఇతర అంశాలను ప్రస్తావిస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే మార్గదర్శిలో కుంభకోణం జరిగిందని మిథున్ చెబుతున్నారన్నారు. గత ఐదేళ్ల కాలంలో మార్గదర్శి అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేదని కూడా సానా నిలదీశారు.

ఏపీలో చోటుషేసుకున్న లిక్కర్ స్కాం ఫై దర్యాప్తు చేయాలని ఇప్పటికే తాను కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశానని సానా చెప్పారు. ఈ మేరకు తన వద్ద ఉన్న పలు ఆధారాలను కేంద్రానికి అందించానని కూడా ఆయన చెప్పుకొచ్చారు. లిక్కర్ స్కాములో మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డిలతో పాటు ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది అన్న దానిపై సమగ్ర దర్యాప్తు జరిగేలా చూస్తామన్నారు. పెద్దిరెడ్డి ఫామిలీ చిత్తూరు జిల్లాలో చేసిన అక్రమాలపై కూడా ఆధారాలు సేకరిస్తున్నామని చెప్పిన సానా.. వాటిపైనా విచారణ జరిగేలా చర్యలు చేపడతామని తెలిపారు. వైసీపీ నేతలు చేసిన ఏ ఒక్క అక్రమాన్ని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పనా సానా… వైసీపీకి ముందున్నది ముసళ్ల పండగేనని హెచ్చరికలు జారీ చేశారు.