విద్యాసంస్ధల విషయంలో ప్రభుత్వం చులకనైపోతోందా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ నేపధ్యంలో మూతపడిన విద్యాసంస్దలను ఎలాగైనా తెరిపించాలన్న పట్టుదలతోనే ప్రభుత్వం జనాల్లో పలుచనైపోతోందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ కారణంగా మొన్నటి మార్చి నెలనుండి దేశమంతా లాక్ డౌన్లోకి వెళ్ళిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా విద్యాసంస్ధలు కూడా మూసేశారు. ఏపిలో కూడా అప్పుడు మూసేసిన విద్యాసంస్ధలు మళ్ళీ ఇప్పటివరకు తెరుచుకోలేదు.

కర్నాటక, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో వచ్చే విద్యాసంవత్సరం వరకు విద్యాసంస్ధలను తెరిచేది లేదని ప్రభుత్వాలు ప్రకటించేసిన విషయం అందరికీ తెలిసిందే. ముందు జాగ్రత్తగా పై ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని జనాలందరు స్వాగతించారు. మరి ఇదే విషయంలో ఏపి ప్రభుత్వం మాత్రం ఎందుకు తొందరపడుతోందో అర్ధంకావటం లేదు. తాజాగా జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశంలో నవంబర్ 2వ తేదీ నుండి విద్యాసంస్ధలను తెరవాలని డిసైడ్ అయ్యింది. 1,3,5,7 తరగతులను ఒకరోజు 2,4,6,8 తరగతులను ఇంకోరోజు తెరవాలని నిర్ణయించారు.

ఇంతవరకు బాగానే ఉంది కానీ విద్యాసంస్ధలను తెరవటంలో ప్రభుత్వం ఎందుకింత తొందరపడుతోంది ? పై రాష్ట్రాల్లో విద్యాసంస్ధలను తెరిచేది లేదని ఎందుకు ప్రభుత్వాలు ప్రకటించాయి. కేవలం కరోనా వైరస్ కు విద్యార్ధులు బలికాకూడదనే. ఒకచోట జనాలు పదిమంది గుమిగూడినా కరోనా వైరస్ వచ్చేస్తోంది. ఇటువంటి నేపధ్యంలో ఒకేసారి వందలాదిమంది విద్యార్ధులు ఒకేచోట చేరితే పరిస్ధితి ఎలాగుంటుందో చెప్పక్కర్లేదు. ప్రభుత్వం తాజాగా డిసైడ్ చేసినట్లుగానే విద్యాసంస్ధలను ఓపెన్ చేస్తే కనీసం నాలుగైదొందల మంది స్టూడెంట్స్ ఒకేచోట చేరుతారు. వారిలో ఎవరికైనా కరోనా వైరస్ ఉంటే అది మిగిలిన వాళ్ళకు అంటుకోవటానికి, వాళ్ళ ద్వారా వాళ్ళ కుటుంబసభ్యులకు సోకటానికి ఎంతసేపు పడుతుంది ?

ఇప్పటికి కనీసం నాలుగుసార్లయినా విద్యాసంస్ధలను ఓపెన్ చేస్తామని ప్రకటించటం మళ్ళీ వైరస్ ఉధృతి కారణంగా వాయిదా వేయటం అందరు చూస్తున్నదే. అంటే పదే పదే స్కూళ్ళను తెరుస్తామని చెప్పి మళ్ళీ వాయిదా వేస్తున్నట్లు చేస్తున్న ప్రకటనల వల్ల ప్రభుత్వం జనాల ముందు పలుచనైపోతోంది. విద్యాసంస్ధలను తెరవమని తల్లిదండ్రులెవరు కోరలేదు. ఎందుకంటే ఎలాగూ ఓ అకడమిక్ ఇయర్ వేస్టయిపోయిన విషయం అర్ధమైపోయింది.

తల్లిదండ్రుల నుండి ఎటువంటి డిమండ్లు లేకుండానే ప్రభుత్వానికి మాత్రం ఎందుకింత తొందరో తెలియటం లేదు. పైగా ప్రభుత్వ నిర్ణయం వల్ల చిన్నపిల్లల్లో ఎవరైనా కరోనా వైరస్ భారిన పడిన కారణంగా జరగరానిది జరిగితే బాధ్యత ఎవరిది ? అసలు తమ పిల్లలను స్కూళ్ళకు పంపటానికి తల్లిదండ్రులే సిద్దంగా లేని సమయంలోనే ప్రభుత్వానికి ఎందుకింత తొందరో ? కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం కాస్త ఆలోచించుకుంటే బాగుంటుంది.