వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే తమ్ముడు…? రోజాకు షాకేనా?

మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చవిచూసిన వైసీపీలోకి ఇప్పుడు కొత్త చేరికలు ఊపందుకున్నట్టుగానే కనిపిస్తోంది. ఇటీవలే పీసీసీ చీఫ్ గా పనిచేసిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్ వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా వైసీపీలోకి మరో కీలక నేత చేరబోతున్నట్టు సమాచారం. ఈ నేతకు ఇప్పటిదాకా పెద్దగా రాజకీయ అనుభవం లేకున్నా… రాజకీయంగా మంచి ప్రాబల్యం ఉన్న కుటుంబానికి చెందిన ఈ నేత వాళ్ళ పార్టీకి మంచి ఊపు వస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఈ కొత్తగా చేరే నేత మరెవరో కాదు… ప్రస్తుతం నగరి నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న టీడీపీ యువ నేత గాలి భాను ప్రకాష్ సోదరుడు గాలి జగదీశ్ ప్రకాష్. తెలుగు నేల రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దివంగత నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడు రెండో కుమారుడే జగదీశ్ ప్రకాష్.

ముద్దు కృష్ణమ టీడీపీతోనే రాజకీయ జీవితాన్ని ప్రారంభించినా.. ఓ దఫా టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు. అయితే.. చాలా తక్కువ సమయంలోనే ఆయన తిరిగి తన సొంత గూడు టీడీపీకి చేరుకున్నారు. ఆ తర్వాత టీడీపీలోనే కొనసాగారు.

ఉమ్మడి చిత్తూర్ జిల్లాలోని పుత్తూరు అసెంబ్లీ నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన ముద్దు… మరోమారు నగరి నుంచి గెలిచి… మొత్తంగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన నేతగా రికార్డులకెక్కారు. ముద్దు కృష్ణమ మరణానంతరం ఆయన రాజకీయ వారసత్వాన్ని భాను ప్రకాష్ చేజిక్కించుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో నగరి నుంచి బరిలోకి దిగిన భాను… ఆర్కే రోజాను మట్టి కరిపించారు.

అయితే చాలా కాలంగా రాజకీయాల్లో కీలక భూమిక పోసించాలని ఉవ్విళ్ళు ఊరుతున్న జగదీశ్.. ఇదివరకే వైసీపీలో చేరేందుకు యత్నించినట్టు సమాచారం. అయితే.. నగరి నుంచి రోజా బలమైన నేతగా ఉండటంతో జగదీశ్ ఎంట్రీకి వైసీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. అయితే ఇప్పుడు రోజాకు ఎలాగైనా చెక్ పెట్టాలని చూస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి.. జగదీశ్ చేరికకు వ్యూహం రచించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

వాస్తవానికి చాలా కాలంగా పెద్దిరెడ్డి, రోజాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సరైన సమయం చూసుకుని పెద్దిరెడ్డి పావులు కదిపారని.. ఆ మేరకు జగన్ కూడా జగదీశ్ చేరికకు దాదాపుగా ఓకే చెప్పారని సమాచారం. త్వరలోనే జగదీశ్ వైసీపీలోకి ఎంట్రీ ఇస్తే… రోజాకు నిజంగానే కష్టాలు మొదలైనట్టేనని చెప్పక తప్పదు.