తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసేందుకు సీఎం చంద్రబాబు కంటే.. ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేష్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి ఏపీ ఎన్నికల్లో ఫలితాలు వచ్చిన తర్వాత చంద్రబాబు కొన్ని రోజులు తెలంగాణ పై దృష్టి పెట్టారు. తెలంగాణలోనూ పార్టీని పుంజుకునేలా చేస్తామని చెప్పారు. వీకెండ్స్లో అక్కడకు వెళ్లి ఎన్టీఆర్ భవన్లో పార్టీ నాయకులతో భేటీ అయ్యారు. దీంతో అంతో ఇంతో జోష్ వచ్చినట్టు అయింది. కానీ.. ఏపీలో పాలన పుంజుకోవడంతో బాబు బిజీ అయ్యారు.
దీంతో తెలంగాణ పై ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టలేక పోయారు. కానీ, మరోవైపు.. పుంజుకునేందుకు అవకాశం ఉందన్న చర్చ కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ హడావుడి చేస్తున్నా.. మాజీ సీఎం కేసీఆర్ మౌనంగా ఉన్నారు. దీంతో కేటీఆర్, హరీష్ రావుల హడావుడి కనిపిస్తోంది. కానీ, ఇది జిల్లాల కేంద్రాలకు మాత్రమే పరిమితమైంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ .. తిరిగి పుంజుకునేలోగానే టీడీపీని పరుగులు పెట్టించడం ద్వారా.. సక్సెస్ కావాలన్నది లోకేష్ వ్యూహం.
ఈ నేపథ్యంలో రాబిన్ శర్మ బృందానికి పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నా యి. మరోవైపు.. రాజకీయ వ్యూహకర్త, సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్న ప్రశాంత్ కిశోర్తోనూ నారా లోకేష్ తాజాగా భేటీ అయ్యారు. ఈ పరిణామాలను గమనిస్తే.. అత్యంత వేగంగా తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు లోకేష్ ప్రయత్నిస్తున్నారన్నది వాస్తవమేనని తెలుస్తోంది. అయితే.. నారా లోకేష్ భావిస్తున్న ట్టు టీడీపీని విస్తరించాలంటే.. చాలా కష్టపడాల్సి ఉంటుంది.
పోయిన నేతలను తిరిగి తీసుకురావడంతోపాటు.. జీరో స్థాయి నుంచి పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. ఇదే సమయంలో ఏపీ-తెలంగాణ మధ్య వివాదంగా ఉన్న జల వనరుల విషయం, ఆస్తుల పంపకాలు.. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన విలీన మండలాల విషయం వంటివాటికి సమాధానం చెప్పాలి. అయితే.. ప్రయత్నిస్తే.. కొండైనా కరుగుతుందన్న సామెత మాదిరిగా..అసలు ప్రజల్లోకి వెళ్లడం అంటూ ప్రారంభమైతే.. టీడీపీకి జోష్ పెరుగుతుందనే ఆశాభావం పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఇక, పార్టీ తెలంగాణ అధ్యక్షుడి నియామకం కూడా వేచి ఉండడం గమనార్హం.