సెకండ్ బిగ్గెస్ట్ ఎన్ కౌంటర్… 33 మంది మృతి

నిషేధిత మావోయిస్టులకు నిజంగానే చావు దెబ్బ తగిలిందని చెప్పక తప్పదు. ఇటీవలి కాలంలో కేంద్ర బలగాలు మావోయిస్టులను ఏరివేసే కార్యక్రమాన్ని మరింతగా ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఇటీవలి కాలంలో వరుసగా చోటుచేసుకుంటున్న ఎన్ కౌంటర్ లలో పదుల సంఖ్యలో మావోయిస్టులు చనిపోతున్నారు. తాజాగా ఆదివారం జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో ఏకంగా 31 మంది మావోయిస్టులు చనిపోయారు. ఈ ఘటనలో కేంద్ర బలగాలకు చెందిన ఇద్దరు పోలీసులు కూడా చనిపోయారు. వెరసి ఈ ఘటనలో మొత్తం 33 మంది చనిపోయినట్టు అయ్యింది.

ఛత్తీస్ గఢ్ లో ఆదివారం తెల్లవారుజామున మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. బీజాపూర్ జిల్లా పరిధిలోని ఇంద్రవతి నేషనల్ పార్క్ అడవుల్లో చోటుచేసుకున్న ఈ కాల్పుల్లో 31 మంది మావోయిస్టులు చనిపోయారు. ఒకే ఎన్ కౌంటర్ లో ఇంత మంది చనిపోవడం మావోయిస్టులకు చావు దెబ్బగానే పరిగణించాలి. గతంలో ఒకే ఎన్ కౌంటర్ లో అత్యధికంగా 40 మంది మావోయిస్టులు చనిపోయారు. తాజా ఎన్ కౌంటర్ లో 31 మంది మావోయిస్టులు  చనిపోవడంతో ఆ పార్టీకి ఇది రెండో అతిపెద్ద నష్టమని చెప్పాలి.

ఇదిలా ఉంటే.. ఈ ఎదురు కాల్పుల్లో భద్రత బలగాలకు కూడా ఓ మోస్తరు నష్టం జరిగింది. మావోయిస్టుల కాల్పుల్లో ఇద్దరు పోలీసులు కూడా చనిపోయారు. మరికొంత మంది పోలీసులకు గాయాలయ్యాయి. వీరిలో పలువురు తీవ్రంగా గాయపడినట్టుగా సమాచారం. వీరిని హుటాహుటీన సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వెరసి ఈ కాల్పుల్లో మొత్తంగా 33 మంది చనిపోయినట్టు అయ్యింది. కాల్పుల అనంతరం అక్కడ మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు సోదాలు చేస్తున్నాయి. దీంతో మృతుల సంఖ్యమరింతగా పెరిగే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.