‘ఎర్ర దండు’ ఇక సర్దుకోవాల్సిందే!

నిజమేనండోయి… ఎర్ర దండు ఇక మూటాముల్లె సర్దుకోవాల్సిందే. గ్రామీణ ప్రాంతాల్లో వామపక్ష పార్టీలకు ఓ మోస్తరుగా ఓట్లు పడుతున్నా.. విద్యావంతులు అధికంగా ఉండే పట్టణాలు, నగరాల్లోని కొన్ని ప్రాంతాలు వాటికి పట్టుగొమ్మలుగా నిలిచాయి. అలంటి వాటిలో ఢిల్లీ కూడా ఒకటని చెప్పక తప్పదు. అయితే… శనివారం విడుదల అయిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూస్తే వామపక్షాల పని అయిపోయినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దేశంలోని చాలా ప్రాంతాలపై పట్టు కోల్పోయిన సిపిఎం, సిపిఐ లు ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలోనూ తమ ఉనికిని ప్రశ్నార్థకం చేసుకున్నాయి.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎం, సిపిఐ లు ఎన్ని సీట్లలో పోటీ చేశాయో తెలియదు గాని… ఆ రెండు పార్టీలకు పడిన ఓట్లు కేవలం 0.01 శాతం మాత్రమేనట. ఇంత తక్కువ స్థాయిలో ఓట్లు ఆ రెండు పార్టీలకు పడటం… ఆ పార్టీల తాజా పరిస్థితికి నిదర్శనంగా నిలుస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. జాతీయ పార్టీలుగా ఉన్న ఈ రెండు పార్టీలు అంతకంతకు తమ ప్రాభవాన్ని కోల్పోతున్నాయని చెప్పడానికి ఈ ఫలితాలు నిదర్శనమన్న వాదనలూ లేకపోలేదు. ఈ పార్టీలకు పడిన ఓట్ల శాతం నోటా కు పడిన ఓట్ల శాతం కంటే కూడా చాలా తక్కువ అని చెప్పాలి. ఢిల్లీ ఎన్నికలో నోటాకు ఏకంగా0.57 శాతం ఓట్లు పడ్డాయి.

వామపక్షాలతో పాటుగా ఒకప్పుడు తమదైన శైలిలో ఢిల్లీలో ప్రభావం చూపిన మరో రెండు జాతీయ పార్టీలకు కూడా ఢిల్లీ ఓటర్లు షాకిచ్చారు. ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం మాయావతి నేతృత్వంలోని బీఎస్పీకి ఢిల్లీ ఎన్నికల్లో… నోటా కంటే కూడా తక్కువగా 0.55 శాతం ఓట్లు వచ్చాయి. అంటే,…ఎదో ఉనికి కోసం ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న పార్టీలకు ఇకపై కాలం చెల్లినట్టేనని ఢిల్లీ ఎన్నికలు తేల్చి చెప్పాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. బీహార్ లో సత్తా చాటుతున్న జేడీయూకు కూడా ఢిల్లీ ఎన్నికల్లో 0.53 శాతం ఓట్లు పడ్డాయట. ఈ రెండు పార్టీలకు కూడా నోటా కంటే కూడా తక్కువ ఓట్లే పడ్డాయి.