టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన పొలిటికల్ కెరీర్ లోనే ఇప్పుడు యమా స్ట్రాంగ్ గా ఉన్నారని చెప్పక తప్పదు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు ఫలితాలను రాబట్టిన చంద్రబాబు… కేంద్రంలోని అధికార పక్షాన్ని తన గుమ్మం వరకు రప్పించుకుంటున్నారు. రాష్ట్రానికి రావాల్సిన అన్ని రకాల ప్రయోజనాల కోసం ఏపీ ప్రతినిధులు ఇప్పుడు ఢిల్లీ వెళ్లడం లేదు. ఆ ప్రయోజనాలను ఇచ్చేందుకు కేంద్రమే ఏపీకి నడిచి మరీ వస్తోంది. శుక్రవారం జరిగిన ఓ పరిణామమే ఇందుకు నిదర్శనం.
గతంలో మనకు ఏమి కావాలన్నా… కేంద్రం వద్దకు ఢిల్లీ దాకా పరుగులు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెప్పాలి. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరి శుక్రవారం ఏపీ రాజధాని అమరావతికి వచ్చారు. సీఎం చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధిపై చర్చలు జరిపారు. అనంతరం పలు శాఖలకు చెందిన సమీక్షల్లోనూ ఆయన పాలుపంచుకున్నారు. ఆ తర్వాత మంగళగిరిలో ఎయిమ్స్ ఆసుపత్రిని కూడా సందర్శించారు. అక్కడి పరిస్థితులను ఆయన పరిశీలించారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా అమరావతి పరిధిలో ఆయన బిజీబిజీగా గడిపారు.
నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పోస్ట్ కేంద్రంలో చాలా కీలకమైనది. దేశంలోని ఆయా రాష్ట్రాలకు కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అందించాలన్న విషయాన్ని నిర్ధారించే సంస్థ ఇదే. ఈ లెక్కన ఈ సంస్థకు నేతృత్వం వహించే వైస్ చైర్మన్ పోస్ట్ అత్యంత కీలకమైనదేనని చెప్పాలి. అలంటి పోస్ట్ లో ఉన్న అధికారి ఢిల్లీని వదిలి బయటకు రావడం బహు అరుదు. ప్రస్తుతం ఆ పోస్టులో ఉన్న సుమన్ బేరి నిన్న నేరుగా అమరావతి రావడం, చంద్రబాబుతో భేటీ కావడం, సాయంత్రం దాకా అమరావతి పరిధినిలోనే పర్యటించడం నిజంగానే ఆశ్యర్యం కలిగించే విషయమే.
ఎన్నికల్లో సత్తా చాటడంతో పాటుగా ఎప్పుడు ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయాలన్న విషయాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉన్న చంద్రబాబు… తనదైన శైలిలో పక్కాగానే పావులు కదుపుతున్నారు. చంద్రబాబు పావులు కదులుతున్నట్టుగానే… కేంద్రం అడుగులు వేయక తప్పడం లేదు. ఫలితంగా ఏపీకి అడిగినా… అడగకున్నా కూడా కేంద్రం నుంచి ఇతోధిక సహకారం లభిస్తోంది. ఇదే తరహాలో చంద్రబాబు మంత్రాంగం కొనసాగితే… రానున్న ఐదేళ్లలో ఏపీ రూపురేఖలు మారిపోవడం ఖాయమేనని చెప్పక తప్పదు.