వర్మ విచారణకు వచ్చాడండోయ్..

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. గత కొన్నేళ్లలో సోషల్ మీడియా వేదికగా హద్దులు దాటి ప్రవర్తించిన వైసీపీ కార్యకర్తలు, ఆ పార్టీ మద్దతుదారులను టార్గెట్ చేయడం తెలిసిన సంగతే. ఇలా ఒక పార్టీ మద్దతుదారులను టార్గెట్ చేయడం కరెక్టా.. ఇలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ఎలా అంటూ దీన్ని తప్పుబడుతున్న వాళ్లు లేకపోలేదు.

కానీ వైసీపీ అధికారంలో ఉండగా సోషల్ మీడియాలో దారుణాతి దారుణమైన పోస్టులతో ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డ వారిని ఊరికే వదిలేయడం కూడా కరెక్ట్ కాదనే వాదనను తప్పుబట్టలేం. రామ్ గోపాల్ వర్మ లాంటి లెజెండరీ డైరెక్టర్ సైతం వైసీపీకి భజన చేసే క్రమంలో ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలను కించపరిచేలా పోస్టులు పెట్టి తన విలువను తగ్గించుకున్నారు. ఇలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాలనే డిమాండ్ టీడీపీ, జనసేన మద్దతుదారుల గట్టిగానే వినిపించింది.

ఈ నేపథ్యంలోనే వర్మ మీద కేసులు నమోదయ్యాయి. కానీ ఆయన్ని విచారణకు రప్పించడానికి పోలీసులు ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్నా ఫలితం లేకపోయింది. ఏపీ పోలీసులు మళ్లీ మళ్లీ నోటీసులు ఇచ్చినా.. వర్మ ఏదో ఒక కారణం చెప్పి విచారణకు గైర్హాజరవుతూనే ఉన్నారు. కోర్టు ద్వారా కూడా పోలీసుల ప్రయత్నాలను అడ్డుకున్నారు. ఐతే ఇప్పటిదాకా ఎలాగోలా నెట్టుకొచ్చాడు కానీ.. ఇక వర్మ వల్ల కాని పరిస్థితుల్లో ఎట్టకేలకు పోలీసుల విచారణకు హాజరయ్యాడు.

ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన వర్మను ఆ స్టేషన్ సీఐ విచారిస్తున్నారు. విచారణకు హాజరు కావడానికి ముందు వర్మ.. వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కలవడం విశేషం. ఆయనతో మాట్లాడాక విచారణకు వెళ్లాడు. సంబంధిత కేసును కొట్టివేయాలంటూ వర్మ క్వాష్ పిటిషన్ వేయగా.. ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం లేకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేసిన కోర్టు.. విచారణకు మాత్రం హాజరు కావాలని స్పష్టం చేసింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వర్మ ఒంగోలు పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.