ఆర్బీఐ కొత్త గవర్నర్ తొలి దెబ్బ అదిరిపోయింది!

రుణాలఫై వడ్డీ రేట్లు గత కొంత కాలంగా పెరుగుతూనే ఉన్నాయి. గడచిన ఐదేళ్లుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షణ కోసం ఏర్పాటు అయిన రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం తీసుకున్న ఓ కీలక నిర్ణయంతో దేశంలో వద్దే రేట్లు తగ్గడానికి మార్గం సుగమం అయ్యింది. ఆర్బీఐ నూతన గవర్నర్ గా ఇటీవలే బాధ్యతలు తీసుకున్న సంజయ్ మల్హోత్రా తన తోలి చర్యతోనే వద్దే రేట్ల తగ్గింపు దిశగా కీలక అడుగు వేశారు. గడచిన ఐదేళ్లుగా ఏ ఒక్కరు ఈ దిశగా అడుగు ముందుకు వేయలేకపోయారు. ఆ సంప్రదాయానికి మల్హోత్రా తిలోదకాలిచ్చేశారు.

గురువారం ఆర్బీఐ త్రైమాసిక ద్రవ్య పరపతి సమీక్ష జరిగింది. ఆర్బీఐ గవర్నర్ గా మల్హోత్రా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన ఈ సమీక్షలో మల్హోత్రా డేరింగ్ స్టెప్ వేశారు. రేపో రేటును 0.25 శాతం తగ్గిస్తూ ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. మొన్నటిదాకా 6.50 గా ఉన్న రేపో రేటు… మల్హోత్రా నిర్ణయంతో 6.25కు దిగివచ్చింది. ఇలా దేశంలో రేపో రేటు తగ్గడం గడచిన ఐదేళ్లలో ఇదే తొలిసారి. ఈ పరిణామం వడ్డీ రేట్లను భారీగా కాకపోయిన ఓ మోస్తరుగా తగ్గిస్తుందని చెప్పాలి. వినియోగదారులపై బ్యాంకులు వసులు చేస్తున్న వడ్డీ రేటులో హీనపక్షం 50 పైసలు తగ్గే అవకాశం ఉంది. దీనిని గృహ, వాహన రుణాలపై భారీ వెసులుబాటుగానే ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. వ్యవసాయ రుణాలపైనా వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలున్నాయి.

అయితే వడ్డీ రేట్లు పెరిగే దిశగా ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నప్పుడు బ్యాంకులు చాలా వేగంగా వడ్డీ రేట్లను పెంచుతాయి. అదే సమయంలో వడ్డీ రేట్లను తగ్గించే దిశగా ఆర్బీఐ నిర్ణయం తీసుకుంటే మాత్రం బ్యాంకులు అంత త్వరగా వడ్డీ రేట్లను తగ్గించవు. ఇప్పుడు కూడా వడ్డీ రేట్లు తగ్గే దిశగా ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నా బ్యాంకులు ఆ దిశగా వేగంగా నిర్ణయం తీసుకుంటాయో… లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వడ్డీ రేట్లను పెంచడంలో చూపించే ఆసక్తిని బ్యాంకులు ఆ వడ్డీ రేట్లను తగ్గించడంలోనూ చూపించేలా ఆర్బీఐ దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.