ఏపీ రాజధాని అమరావతిని పరుగులు పెట్టించాలని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత ఐదేళ్లుగా వర్షపు నీరు, వరద నీటలో నానిన అమరావతి భవనాల నుంచి నీటిని తోడించింది. అనంతరం.. భవన నిర్మాణాలకు సంబంధించిన పనులకు టెండర్లు పిలిచేందుకు రెడీ అయింది. ఈ ప్రక్రియ ఇటీవలే ప్రారంభమైంది. షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరిలో టెండర్ల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది.
వరుసగా నెల మొత్తం ఐకానిక్ భవనాలు సహా.. ఇతర పర్మినెంట్ నిర్మాణాలకు కూడా టెండర్లు ఆహ్వానించేందుకు సీఆర్ డీఏ రెడీ అయింది. అయితే.. ఇంతలోనే.. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో కోడ్ అడ్డు వచ్చింది. అమరావతి పనులు నిలిపివేయాల్సి ఉంటుందని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. దీంతో సర్కారుకు ఎటూ తోచని పరిస్థితి ఏర్పడింది. ఇలా ఆపుకొంటూ పోతే.. వచ్చే మార్చి వరకు వెయిట్ చేయాలని భావించింది.
ఇంతలో కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఈ విషయంలో వెసులుబాటు కల్పించాలని కోరింది. దీనిపై వెంటనే స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం.. “అమరావతిని ఆపద్దు” అని పేర్కొంది. అమరావతిలో నిర్మాణ పనులకు సంబంధించి టెండర్లు పిలిచేందుకు ఎలాంటి కోడ్ అడ్డంకి కాదని తెలిపింది. రాజధానిలో టెండర్లు పిలిచేందుకు అభ్యంతరం లేదని పేర్కొంటూ.. టెండర్లు పిలిచేందుకు అనుమతించింది. అయితే, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక మాత్రమే టెండర్లు ఖరారు చేయాలని స్పష్టం చేసింది.
కృష్ణ-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ ఎన్నికల ప్రక్రియ మార్చి 3వ తేదీ వరకు కొనసాగనుంది. దీంతో ఇప్పటికే కొన్ని కీలక పనులను ప్రభుత్వం నిలుపుదల చేసుకుంది.