దేశభాషలందు తెలుగు లెస్స అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు అంటుంటే…ఏపీలో వైసీపీ ప్రభుత్వం మాత్రం ఏపీలో తెలుగు ‘లెస్’ అన్న వైనంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం అంటూ తెలుగు భాషకు ప్రాధాన్యత తగ్గించే ప్రయత్నం చేశారని జగన్ సర్కార్ పై విమర్శలు వచ్చాయి. దాంతోపాటు, అందరికీ అందుబాటులో ఉండాల్సిన జీవోలను రహస్యంగా ఉంచిందన్న అపవాదు గత ప్రభుత్వంపై ఉంది.
కట్ చేస్తే…ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలుగు భాష తియ్యదనం మరింత పెరిగేలా, జీవోల విడుదలలో పారదర్శకత ఉండేలా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జారీ అయ్యే ప్రభుత్వ ఉత్తర్వులు(జీవో) తెలుగులో కూడా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ రోజు ఏపీ చరిత్రలో తొలిసారిగా తెలుగు భాషలో మొట్టమొదటి జీవో విడుదలైంది. మొదటగా ఏపీ హోంశాఖ ఓ ఖైదీ పెరోల్కు సంబంధించిన జీవోను తెలుగులో కూడా విడుదల చేసింది.
ఈ రోజు నుంచి ఏపీ ప్రభుత్వం విడుదల చేసే ప్రతీ జీఓ ముందుగా ఇంగ్లిషు భాషలో విడుదల కానుంది. ఆ తర్వాత రెండు రోజులలోపు అదే జీఓను తెలుగు భాషలో కూడా విడుదల చేస్తారు. ప్రభుత్వ నిర్ణయాలు, ఉత్తర్వులు ప్రజలందరికీ సులభంగా అర్థం కావడంతోపాటు పబ్లిక్ డొమైన్ లో అందుబాటులో ఉండనున్నాయి.
చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై తాము కూడా జీవోలలో ఏముందో చదువుకునే వెసులుబాటు ఉంటుందని, తమకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, వగైరాల వివరాలు సులభంగా అర్థం చేసుకునే వీలుంటుందని అంటున్నారు. ఇప్పటి దాకా ఇంగ్లిషులో ఉండే జీవో అంటే ఇంగ్లిషు రాని వారికి ఓ బ్రహ్మ పదార్థంలా ఉండేదని, కానీ, ఇకపై తెలుగు వచ్చిన మెజారిటీ ఏపీ ప్రజలు జీవోలలో సమాచారాన్ని సులభంగా అర్థం చేసుకోగలరని హర్షం వ్యక్తం చేస్తున్నారు.