ఆ ఎమ్మెల్యే… అధిష్ఠానాన్నే ధిక్కరిస్తున్నారే!

ఏపీలో అధికార పక్షం కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీలో కొందరు నేతల సొంత నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. కూటమి అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలోని పలు నగర పాలక సంస్థల్లో పాలక పక్షాలు మారిపోతున్నాయి.

కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అటుఇటూ మారిపోతున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ జిల్లా నందిగామ నగర పంచాయతీలో చైర్ పర్సన్ ఎన్నిక అనివార్యంగా మారగా…అది టీడీపీ ఖాతాలో చేరిపోనుంది.

ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడన్నా వైరి వర్గాల నుంచి ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. అయితే అందుకు విరుద్ధంగా టీడీపీలో సొంత పార్టీ ఎమ్మెల్యే నుంచే ఇబ్బంది తలెత్తుతోంది. నందిగామ నగర పంచాయతీ చైర్ పర్సన్ పదవికి శాఖమూరి స్వర్ణలత పేరును ఖరారు చేసింది.

అయితే స్తానిక ఎమ్మెల్యేగా ఉన్న తంగిరాల సౌమ్య మాత్రం స్వర్ణలత అభ్యర్థిత్వానికి ససేమిరా అంటున్నారు. అధిష్ఠానాన్ని సంప్రదించకుండానే… పార్టీకి చెందిన మరో కౌన్సిలర్ సత్యవతికి చైర్ పర్సన్ గా అవకాశం కల్పించాలని సౌమ్య నిర్ణయించినట్లుగా సమాచారం.

ఈ విషయం తెలిసిన స్థానిక ఎంపీ కేశినేని చిన్ని పార్టీ అధిష్ఠానం నిర్ణయాన్ని అమలు చేసి తీరాలని ఎమ్మెల్యేకు సూచించారట. అయితే అభ్యర్థి ఎంపిక విషయంలో స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న తనను ఎందుకు సంప్రదించరంటూ సౌమ్మ ప్రశ్నించారట. స్థానిక ఎమ్మెల్యేగా తాను ఇప్పటికే సత్యవతికి మాట ఇచ్చానని, ఆమె అభ్యర్థిత్వానికే పార్టీ అనుమతి ఇవ్వాలని కోరారట.

అయితే అధిష్ఠానం ఓ అభ్యర్థిని నిర్ణయించాక మళ్లీ మార్చడం అంటూ ఉండదని, స్వర్ణలత అభ్యర్థిత్వానికే ఒప్పుకుని తీరాలని చిన్ని చెప్పారట. ఈ క్రమంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన సౌమ్య సోమవారం జరగాల్సిన చైర్ పర్సన్ ఎన్నిక వాయిదా పడేలా చేశారట. మరి మంగళవారమైనా ఈ సమస్య ఓ కొలిక్కి వస్తుందో లేదో చూడాలి.