2034 వరకు తెలంగాణకు నేనే సీఎం: రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారత గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వర్సిటీ ప్రాంగణంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత విద్యార్థులు, విద్యావేత్తలను ఉద్దేశించి సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంలో పలు కీలక అంశాలను ఆయన ప్రస్తావించారు.

2034 వరకు తెలంగాణకు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ విషయంలో చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, పదేళ్ల పాటు రాష్ట్రానికి రేవంత్ సీఎంగా ఉంటారా? అని నొసళ్లు చిట్టిస్తున్నారని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాను తప్పనిసరిగా రానున్న పదేళ్ల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తానని బలంగా విశ్వసిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ పదేళ్ల కాలంలో రాష్ట్ర రూపు రేఖలను మారుస్తామని ఆయన తెలిపారు.

పదేళ్ల పాటు సీఎం పదవికి రేవంత్ రెడ్డి ఓ ఆసక్తికర పరిణామ క్రమాన్ని ప్రస్తావించారు. 1994 నుంచి అటు ఉమ్మడి రాష్ట్రంలోనూ.. ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చిన ప్రతి పార్టీ పదేళ్ల పాటు అధికారాన్ని దక్కించుకున్నదని ఆయన చెప్పారు. ఈ లెక్కన 2023లో తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ… రెండు టెర్మ్ ల పాటు అధికారంలో కొనసాగి తీరుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అదికారంలో ఉండే ఈ పదేళ్ల పాటు రాష్ట్రానికి సీఎంగా తానే కొనసాగుతానని కూడా రేవంత్ చెప్పారు.

ఇక వర్సీటీలకు వీసీల నియామకాల్లో కేంద్ర ప్రభుత్వ పెత్తనాన్ని రేవంత్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఉస్మానియా యూనివర్సిటీకి ఇప్పటిదాకా ఒక్క దళిత నేత కూడా వీసీ కాలేకపోయారన్న రేవంత్.. రాష్ట్రాల పరిధిలోని వర్సీటీల వీసీల నియామకాలను రాష్ట్రాలకే వదిలిపెట్టాలని కోరారు. ఈ విషయంలో కేంద్రం దిగి రాకపోతే దక్షిణాది రాష్ట్రాలతో కలిసి కేంద్రంపై పోరాటం చేస్తామన్నారు. ఇప్పటికే ఈ దిశగా కర్ణాటక, తమిళనాడు, కేరళ సీఎంలతో తాను మాట్లాడానని, త్వరలోనే ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితోనూ చర్చిస్తానని తెలిపారు. ఈ విషయంలో తమతో కలిసి విద్యార్థులు, విద్యావేత్తలు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

చివరగా శనివారం కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డులపైనా రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యమ నేత మంద కృష్ణ మాదిగకు పద్మ పురస్కారం దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేసిన రేవంత్… తెలంగాణకు చెందిన వారి పట్ల మాత్రం కేంద్రం పక్షపాత వైఖరిని ప్రదర్శించిందని తెలిపారు. తెలంగాణ కోటా కింద గద్దర్, అందెశ్రీ, గోరటి వెంకన్న తదితరుల పేర్లను ప్రతిపాదిస్తే… వారిలో ఒక్కరంటే ఒక్కరి పేరును కూడా కేంద్రం పరిగణనలోకి తీసుకోకపోవడం సరికాదని ఆయన అబిప్రాయపడ్డారు.