విన్నారా? ఆ గ్రామంలో వరదకూ వార్షికోత్సవరమట

వివాహ వార్షికోత్సవం….ఏదైనా సంస్థ వార్షికోత్సవం….ప్రైవేటు పాఠశాలల వార్షికోత్సవం…ఇలా ఎన్నో రకాల వార్షికోత్సవాల గురించి విన్నాం. ఈ వార్షికోత్సవాలన్నీ సంతోషంతో జరుపుకునేవి. అయితే, ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురం దగ్గరలో ఉన్న గొల్లప్రోలు గ్రామ ప్రజలు మాత్రం బాధతో ఓ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. అంతేకాదు, ఆ వార్షికోత్సవానికి విచ్చేస్తున్న ప్రజా ప్రతినిధులకు స్వాగతం పలుకుతున్నారు.

గత 30 సంవత్సరాలుగా తమ గ్రామం వరదనీటిలో మునిగిపోతుందని, ఈ ఏడాది కూడా మునిగిపోయిందని ఆ గ్రామస్థులు తమ ఆవేదనను వ్యక్తపరిచారు. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా తమ గ్రామాన్ని సందర్శించేందుకు ప్రజాప్రతినిధులు రాబోతున్నారని, వారు వస్తున్నారు…చూస్తున్నారు…వెళుతున్నారు….అని వ్యగ్యంగా ఊరి పొలిమేరలో బ్యానర్ కట్టారు ఆ గ్రామ ప్రజలు. ప్రస్తుతం ఈ బ్యానర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

తమ గ్రామానికి ఇది 30వ వరద వార్షికోత్సవం అని, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా తమ ఈబీసీ కాలనీ వరదను తిలకించడానికి విచ్చేయుచున్న ప్రజా ప్రతినిధులకు ఇదే మా స్వాగతం అని ఆ ఊరి ప్రజలు కట్టిన బ్యానర్ ఇపుడు ఆ ప్రాంతంలో చర్చనీయాంశమైంది. ప్రజాప్రతినిధులు వస్తున్నారు…. చూస్తున్నారు… వెళుతున్నారు…అంటూ గొల్లప్రోలు ఈబీసీ కాలనీ ప్రజలు తమ బాధను, ఆవేదనను, నిరసనను వెటకారంగా వ్యక్తం చేశారు.

ఇకనైనా తమ గ్రామాన్ని వరదనీరు ముంచెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ఆ గ్రామ ప్రజలు కోరుతున్నారు. మరి, ఈ విషయంపై అక్కడి ప్రజాప్రతినిధుల స్పందన ఏవిధంగా ఉంటుందో వేచి చూడాలి. తెలంగాణలో ఓ ప్రజాప్రతినిధిపై కూడా ఇదే తరహాలో బ్యానర్ కట్టి ప్రజలు తమ నిరసన తెలిపారు. ఓ ప్రజాప్రతినిధి ఖరీదైన కారు కొన్నారని, అయితే, ఆ కారు నడిపేందుకు ఆ నేత ఉన్న ప్రాంతంలో రోడ్డు అనువుగా లేదని చెబుతూ ఓ బ్యానర్ కట్టారు. ఈ గుంతలు, గతుకులు ఉన్న రోడ్లో ఆ కారులో ప్రయాణిస్తే సదరు ప్రజాప్రతినిధికు నడుమునొప్పి వస్తుందంటూ వెటకారంగా బ్యానర్ రాశారు.