లెక్క చాలానే ఉంది.. నాగార్జునే తేల్చుకోవాలి

‘యువ‌కుడు.. ఉత్సాహ‌వంతుడు.. రాజ‌కీయాల్లో దూకుడు ప్ర‌ద‌ర్శిస్తాడు.. సో అందుకే ఆయ‌న‌కు ప‌ద‌వి ఇచ్చాం!!’ టీడీపీలో ఓ నాయ‌కుడి గురించి పేద్ద ఎత్తున వినిపిస్తున్న మాట‌! వినేందుకు, అనేందుకు కూడా చాలా ఇంపుగా సొంపుగా ఉన్న‌ప్ప‌టికీ.. దీని వెనుక టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ్యూహం చాలానే ఉంద‌నే లెక్క‌లు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఆయా పెద్ద అంచ‌నాతోనే బాబు ఓ న‌వ‌యువ‌కుడికి అవ‌కాశం ఇచ్చార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఆ క‌థేంటో చూద్దాం. ఇటీవ‌ల టీడీపీ పార్ల‌మెంట‌రీ జిల్లాల అధ్య‌క్షుల‌ను చంద్ర‌బాబు నియ‌మించారు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రు వార‌సుల‌కు అవ‌కాశం ఇచ్చారు.

వీరిలో ఒక‌రు మాజీ మంత్రి కిమిడి మృణాళిని కుమారుడు కిమిడి నాగార్జున‌. గ‌త ఎన్నిక‌ల్లో తొలిసారి చీపురుప‌ల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈయ‌న‌ను తీసుకువ‌చ్చి.. చంద్ర‌బాబు విజ‌య‌న‌గ‌రం పార్ల‌మెంట‌రీ పార్టీ అధ్య‌క్ష ప‌గ్గాలు అప్ప‌గించారు. అప్ప‌ట్లోనే ఈయ‌న వ‌య‌సుకు, ఇచ్చిన బాధ్య‌త‌ల‌కు పొంత‌న ఉందా? అనే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌చ్చాయి. అయితే, ఏం చేసినా.. బాబు ఊరికేనే చేయ‌రు క‌దా! చాలా వ్యూహం ఉండే ఉంటుంద‌ని అప్ప‌ట్లోనే తెర‌చాటు వ్యాఖ్యానాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఇప్పుడు దీనికి సంబంధించి అనేక విశ్లేష‌ణ‌లు వెలుగు చూస్తున్నాయి.

విజ‌య‌న‌గ‌రంలో ఇద్ద‌రు కీల‌క‌నేత‌లు.. మ‌రో ముఖ్య నేత అల‌క‌పాన్పు ఎక్కారు. వీరిని బుజ్జ‌గించ‌డం ఇప్పుడున్న ప‌రిస్థితిలో బాబుకు వీలుకాదు. పైగా వారు ఎవ‌రికి ఇష్టం వ‌చ్చిన‌ట్టు వారు ఉన్నారు. వారే.. కేంద్ర మాజీ మంత్రి, జిల్లా పార్టీ అధ్య‌క్షుడు అశోక్ గ‌జ‌ప‌తిరాజు, మాజీ ఎమ్మెల్యే మీసాల గీత‌, మాజీ మంత్రి సుజ‌య్ కృష్ణ‌రంగారావు. వీరు పార్టీలోనే ఉన్నారు. కానీ, పార్టీ కార్య‌క్ర‌మాల‌ను ప‌ట్టించుకోరు. పార్టీ అధినేత‌ను లెక్క‌చేయ‌రు. కానీ, ప‌ద‌వులు కావాల‌ని కోరుతున్నారు. వీరిలో ఎవ‌రికి ఇచ్చినా.. మిగిలిన ఇద్ద‌రూ దూరం కావ‌డం ఖాయం. పైగా వీరిని లైన్‌లో పెట్టాలి. అందుకే చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా కిమిడి నాగార్జున‌కు ప‌గ్గాలు అప్ప‌గించారనేది ఒక వాద‌న‌.

మ‌రో కీల‌క విష‌యం ఏంటంటే.. నాగార్జున మాట వీరు ఎలాగూ విన‌రు. సో.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి వీరిని ప‌క్క‌న పెట్టి నాగార్జున చెప్పిన‌(అంటే బాబుదే నిర్ణ‌యం అనుకోండి)వారికి ఛాన్స్ ఇచ్చేసి.. ఆ ప‌నేదే నాగార్జున‌తో చేయించాల‌నేది బాబు మ‌రో వ్యూహంగా క‌నిపిస్తోంది. స‌రే! ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఈ సీనియ‌ర్లు చంద్ర‌బాబు మాట‌నే లెక్క‌చేయ‌డం లేదు. ఇక‌, నాగార్జున మాట‌ను లెక్క‌చేస్తారా? ఆయ‌న ర‌మ్మంటే కార్య‌క్ర‌మాల‌కు వ‌స్తారా? అంటే లేద‌నేదే నిక‌ర‌మైన స‌మాధానం. సో.. ఇప్పుడు లెక్క‌లు కుద‌ర్చాల్సింది.. తేల్చుకోవాల్సింది నాగార్జునే! లేకుండా ఆయ‌న కూడా విఫ‌ల‌మైన నాయ‌కుల జాబితాలోకి చేరిపోవ‌డం ఖాయం అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.