మొదలైన చంద్రబాబు కేసుల విచారణ

రాష్ట్రంలోని ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష అధినేతపై ఉన్న కేసుల విచారణ ఒకేసారి మొదలైంది. ఈడీ, సీబీఐ ప్రత్యేక కోర్టులో జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులపై విచారణ మొదలైంది. ఇదే సమయంలో ఏసీబీ కోర్టులో చంద్రబాబునాయుడు అక్రమాస్తుల కేసుతో పాటు, ఓటుకునోటు కేసుపైన కూడా విచారణ మొదలైంది. ఇద్దరిపైన పెండింగ్ లో ఉన్న కేసుల విచారణను ఇక నుండి రోజువారి ప్రాతిపదికగా విచారణ చేస్తామని పై కోర్టులు ప్రకటించాయి.

జగన్ పై విచారణ ఇంతకాలం నత్తకే నడకలు నేర్పుట్లుగా జరిగింది. తనపై నమోదైన కేసుల విచారణను వెంటనే విచారణ చేయమని ఒక దశలో జగన్ కోరినా విచారణలో స్పీడైతే పెరగలేదు. ఇదే సమయంలో తనపై నమోదైన కేసుల విచారణ జరిపేందుకు లేదని చంద్రబాబు స్టే తెచ్చుకున్న విషయం అందరికీ తెలిసిందే.

చట్టసభల్లో నేరచరితులు ఉండకూడదన్న సుప్రింకోర్టు ఆలోచనలో భాగమే ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ. ప్రస్తుత, మాజీ ఎంపిలు, ఎంఎల్ఏలతో పాటు ఇతర స్ధాయిల్లో ఉన్న ప్రజాప్రతినిధులపైన పెండింగ్ లో ఉన్న అన్నీ కేసులను రోజువారీ విచారించాల్సిందే అంటు సుప్రింకోర్టు దేశంలోని అన్నీ హైకోర్టులకు ఆదేశాలిచ్చింది. ఇందులో భాగంగానే నేతల కేసుల విచారణపై ఉన్న స్టేలను కూడా ఎత్తేసింది. అవసరమైతే ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలంటూ సుప్రింకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది.

ఈ నేపధ్యంలోనే దాదాపు 15 ఏళ్ళుగా స్టేపై కంటిన్యు అవుతున్న లక్ష్మీపార్వతి చంద్రబాబుపై వేసిన కేసును ఏసీబీ ప్రత్యేక కోర్టు విచారణ మొదలుపెట్టింది. చంద్రబాబు అక్రమస్తుల సంపాదనపై 2005లో లక్ష్మీపార్వతి కేసు వేశారు. 1977 నుండి 2014 వరకు చంద్రబాబు ఆస్తులపై విచారణ జరపాలంటూ వేసిన కేసును ఏసీబీ విచారణ మొదలుపెట్టగానే చంద్రబాబు హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు.

2004 ఎన్నికల సందర్భంగా చంద్రబాబు సమర్పించిన అఫిడ్ విట్ ఆధారంగా లక్ష్మీపార్వతి ఈ కేసు వేశారు. ఇదే సమయంలో చంద్రబాబు ఆక్రమ ఆస్తులపై తన దగ్గరున్న ఆధారాలను కూడా కోర్టుకు అందించారు. రెండింటిని చూసిన తర్వాతే ఏసీబీ న్యాయస్ధానం విచారణ మొదలుపెట్టింది. అయితే హైకోర్టు ఇచ్చిన స్టే కారణంగా విచారణ అప్పటి నుండి జరగలేదు. సుప్రింకోర్టు ఆదేశాలతో ఈ కేసుపై ఈనెల 21న విచారణ మొదలవుతోంది.

ఇక ఓటుకునోటు కేసు గురించి అందరికీ తెలిసిందే. తెలంగాణా ఎంఎల్సీ ఎన్నికల్లో తెలంగాణా ఎంఎల్ఏ స్టీఫెన్ ఓటు కొనుగోలుకు టీడీపీ రూ. 5 కోట్లకు బేరం కుదుర్చుకున్నది. బేరంలో భాగంగా అడ్వాన్సు క్రింద రూ. 50 లక్షలు ఇవ్వటానికి పార్టీ తరపున అప్పటి ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి స్టీఫెన్ సన్ ఇంటికి వెళ్ళాడు. నామినేటెడ్ ఎంఎల్ఏకు డబ్బు ఇస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు రెయిడ్ చేసి రేవంత్ ను పట్టుకున్నారు. అప్పట్లో ఓటుకునోటు కేసు దేశంలో ఎంత సంచలనమైందో అందరికీ తెలిసిందే. కేసుపై ఏసీబీ కోర్టులో విచారణ జరక్కుండా చంద్రబాబు స్టే తెచ్చుకున్నారు. ఇపుడాస్టే కూడా వెకేట్ అవ్వటంతో ఆ కేసు ఈ నెల 12వ తేదీన మొదలవుతోంది.