ఎమ్మెల్సీ కవిత పదవీ కాలం అంత తక్కువా?

ఎట్టకేలకు నిజామాబాద్ స్థానిక సంస్థలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ఘట్టం పూర్తి అయ్యింది. ఫలితం ఏమిటన్నది లాంఛనమే. అధికార టీఆర్ఎస్ కు పూర్తి అధిక్యత ఉన్న నేపథ్యంలో కవితను ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లుగా ప్రకటించటం అధికారిక తంతు మాత్రమే. అంతకు మించి.. ఎలాంటి ట్విస్టులు ఉండవు. నిజానికి ఆమెను ఎమ్మెల్సీగా పిలిచినా తప్పేం లేదనే చెప్పాలి. సాధారణంగా ఎమ్మెల్సీ పదవీ కాలం గరిష్ఠంగా ఆరేళ్లు ఉంటుంది. కానీ.. తాజాగా కవిత పదవీ కాలం మాత్రం కేవలం 14 నెలలు మాత్రమే అని చెబుతున్నారు.

గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసిన ఆమె.. బీజేపీ అభ్యర్థి అర్వింద్ చేతిలో ఓటమిపాలు కావటం తెలిసిందే. అప్పటి నుంచి మౌనంగా ఉంటున్న ఆమెను.. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు గులాబీ బాస్ కేసీఆర్. మిగిలిన ఎమ్మెల్సీల మాదిరి కాకుండా కవిత పదవీ కాలం 14 నెలలకే పరిమితం కావటం ఏమిటి? కారణమేమిటి? అన్న ప్రశ్నలు ఎదురుకాక మానవు. సాంకేతిక అంశాలే ఇందుకు కారణంగా చెప్పక తప్పదు. తాజాగా ముగిసిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఉప ఎన్నిక మాత్రమే అన్న విషయాన్ని మర్చిపోకూడదు.

టీఆర్ఎస్ తరఫున 2016లో ఎన్నికైన ఎమ్మెల్సీ భూపతిరెడ్డి పార్టీ ఫిరాయింపు కారణంగా అనర్హత వేటుకు గురయ్యారు. ఆయన పదవీ కాలం 2022 వరకు ఉంది. అయితే.. ఎన్నికైన తర్వాత ఆయన అనుసరించిన తీరుతో పదవి ఊడిపోయింది. ఆయనకున్న పదవీ కాలానికి అనుగుణంగా తాజాగా ఉప ఎన్నికను నిర్వహించారు. వాస్తవానికి ఈ ఎన్నికను ఇంతకు ముందే నిర్వహించాల్సి ఉంది. కరోనా కారణంగా ఎన్నికల ప్రక్రియ ఆలస్యమైంది.

ఈ కారణంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత కేవలం 14 నెలలు మాత్రమే కవిత పదవిలో ఉండనున్నారు.
ఒకవేళ ఇప్పటికే ప్రచారం జరుగుతున్నట్లుగా జమిలి ఎన్నికలు అనివార్యమైతే.. ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న కవిత.. మరోసారి ఎంపీగా బరిలోకి దిగే వీలుందని చెబుతున్నారు. అదే జరిగితే.. తాను ఎంపీ కావాలన్న కలను తీర్చుకునే మరో అవకాశం దక్కుతుంది. ఒకవేళ.. అలాంటిదేమీ లేకపోతే మరోసారి ఎమ్మెల్సీగా ఆమె ఎన్నిక కావటం ఖాయమంటున్నారు.