ఏపీ ఎమ్మెల్యేకు రెండోసారి కరోనా

తిరుపతి వైసిపి ఎంఎల్ఏ భూమన కరుణాకర్ రెడ్డి రుయా ఆసుపత్రిలో చేరారు. కరోనా వైరస్ నిర్ధారణ అవ్వటంతో భూమన బుధవారం అర్జంటుగా ఆసుపత్రిలో చేరారు. గతంలో కూడా కరోనా వైరస్ సోకటంతో భూమన ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. మొదటిసారి ఆసుపత్రిలో చేరినపుడు పదిరోజులు ఐసొలేషన్ లో ఉన్నారు. తర్వాత రక్త పరీక్షలు చేయించుకుని నెగిటివ్ అని తేలటంతో ఆసుపత్రి నుండి డిశ్చార్జయ్యారు. మళ్ళీ ఇపుడు రెండోసారి ఆసుపత్రిలో చేరారు. కరోనా వైరస్ సమస్యను పక్కన పెట్టేసి ఎంఎల్ఏ కాబట్టి ప్రతిరోజు భూమన జనాల్లోనే తిరుగుతున్నారు. ఈ కారణంగా భూమనకు సులభంగా కరోనా సోకుతోంది.

అయితే రెండోసారి కరోనా వైరస్ సోకటంలో మాత్రం తిరుమల పర్యటనే కారణమని ఎంఎల్ఏ మద్దతుదారులు చెబుతున్నారు. తిరుమలలో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సోవాలలో గరుడోత్సవం రోజున జగన్మోహన్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించిన విషయం తెలిసిందే. జగన్ తిరుమలకు వచ్చి శ్రీవారి సేవలో పాల్గొనే సమయానికి కొందరు మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపిలు తిరుమలకు వచ్చారు. ఉత్సవాల్లో జగన్ తో పాటు వాళ్ళంతా రెండు రోజుల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తర్వాత దేవాదాయ శాఖమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చల్లబోయిన వేణుగోపాల కృష్ణతో పాటు మరికొందరు ఎంఎల్ఏలకు కూడా కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణయ్యింది.

అంటే వీళ్ళకందరికీ జగన్ పర్యటనకు ముందే కరోనా వైరస్ సోకిందన్న విషయంలో అనుమానం లేదు. తమకు కరోనా వైరస్ సోకిన విషయం తెలిసో తెలీకో వీళ్ళంతా జగన్ పర్యటనలో పాల్గొన్నారు. తమకు కరోనా సోకిందని తెలిసిన తర్వాత వీళ్ళంతా ఐసొలేషన్ లోకి వెళ్ళిపోయారు. అయితే అప్పట్లో భూమనకు ఎటువంటి లక్షణాలు లేకపోవటంతో పట్టించుకోలేదు. కానీ రెండు రోజులుగా జ్వరం, ఆయాసంతో ఇబ్బందులు మొదలవ్వటంతో భూమన అవసరమైన పరీక్షలు చేయించుకున్నారు. దాంతో తనకు రెండోసారి మళ్ళీ కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణవ్వటంతో వెంటనే రుయా ఆసుపత్రిలో చేరిపోయారు.

ఇదే సమస్యతో భూమన కొడుకు కూడా నాలుగు రోజుల క్రితం రుయా ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ప్రతిరోజు జనాల్లోనే తిరుగుతుండటం, ప్రతిరోజు అనేకమంది వీళ్ళని కలుస్తుండటంతో ఎవరికి వైరస్ ఉంది ఎవరికి లేదన్న విషయంలో క్లారిటి లేకపోవటమే అసలు సమస్యగా మారింది. ఇందుకనే ప్రజాప్రతినిధులు ఎక్కువగా కరోనా వైరస్ భారిన పడుతున్నారు.