ట్రాక్టర్‌పై సోఫా.. రాహుల్‌ను విలేకరి ప్రశ్నిస్తే?

రాహుల్ గాంధీకి సోషల్ మీడియాలో ట్రోల్స్ కొత్తేమీ కాదు. అతను పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, తనను కాంగ్రెస్ పార్టీ పెద్ద లీడర్‌గా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం మొదలైనప్పటి నుంచి ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది.

భారతీయ జనతా పార్టీ ఐటీ సెల్‌లో పని చేసే వాళ్లు, ఆ పార్టీ మద్దతుదారులు ఎప్పుడూ ఇదే పనిలో ఉంటారు. తాజాగా రాహుల్ మరోసారి సోషల్ మీడియాకు టార్గెట్ అయ్యాడు. అతను యూపీలో ఒక పర్యటన సందర్భంగా ట్రాక్టర్ ఎక్కగా.. అతనిలా ట్రాక్టర్ ఎక్కుతాడని ముందే సమాచారం అందుకున్న పార్టీ వర్గాలు ఆ ట్రాక్టర్‌లో సోఫా తరహా సీటు ఏర్పాటు చేశాయి.

అందులో కూర్చుని రైతులను కలుసుకునేందుకు వెళ్లాడు రాహుల్. అతను ఏ తప్పు చేస్తాడా అని కాచుకుని ఉండే వ్యతిరేకులు ఈ ఫొటో చూడగానే రెచ్చిపోయారు. విపరీతంగా ట్రోల్ చేశారు.

అంతటితో ఆగకుండా రాహుల్ తాజాగా పాల్గొన్న విలేకరుల సమావేశంలో ఒక రిపోర్టర్.. దాని గురించి ప్రశ్నించాడు. రైతులను పరామర్శించేందుకు వెళ్తూ ట్రాక్టర్‌లో సోఫా సీటు ఏర్పాటు చేసుకోవడం ఏంటి అని అడిగాడు. ఐతే దీనికి ముందుగా ప్రిపేరయ్యాడో ఏమో కానీ.. రాహుల్ ఆ విలేకరికి దీటుగా బదులిచ్చాడు.

ప్రధాని నరేంద్ర మోడీ తన పర్యటనల కోసం ఏకంగా రూ.8 వేల కోట్ల దాకా ప్రజాధానాన్ని ఖర్చు పెట్టి విలాసవంతమైన విమానాలు కొనుక్కున్నాడన్న సంగతి తెలుసా? దాని గురించి మీరెవరైనా ఆయన్ని అడుగుతున్నారా అని ప్రశ్నించాడు రాహుల్. తాను వెళ్లిన ట్రాక్టర్లో రెండు సీట్లు కుషన్‌తో ఉండటం గురించి అడుగుతున్నారని.. కానీ మోడీ విమానాల్లో మొత్తం అన్నీ విలాసవంతమైన ఏర్పాట్లే ఉంటాయని.. అవన్నీ ప్రజాధనంతో కొనుగులో చేసుకున్నవే కదా.. మరి వాటి మాటేంటి అని అడిగాడు రాహుల్.

దీనికి ఆ విలేకరి నుంచి సమాధానం లేకపోయింది. రాహుల్ మాటల్లో అతిశయోక్తి ఏమీ లేదు. ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిల ప్రయాణాల కోసం అమెరికా నుంచి రూ.8400 కోట్లతో విమానాలు తయారు చేయించి తెప్పిస్తోంది ప్రభుత్వం.