జగన్ కేసుల పై నవంబర్ నుండి విచారణ?

సుప్రింకోర్టు ఆదేశాల ప్రకారం ప్రజా ప్రతినిధులు, మాజీలపై నమోదైన కేసుల విచారణ ఇక నుంచి స్పీడందుకోనుంది. పరిస్దితులన్నీ అనుకూలిస్తే బహుశా నవంబర్ నుంచి ప్రత్యేకకోర్టులో విచారణలు మొదలు అయ్యే అవకాశాలున్నాయి. కేసులు నమోదైన వాళ్ళందరికీ వెంటనే సమన్లు పంపాలని హైకోర్టు దిగువ కోర్టులతో పాటు ఏసిబి, సిబిఐ తదితర కోర్టులను ఆదేశించింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ప్రస్తుత, మాజీ ప్రజా ప్రతినిధులు 118 మందిపై అనేక కేసులు వివిధ దశల్లో విచారణలో ఉన్నాయి. కాకపోతే ఈ కేసులన్నీ సంవత్సరాల తరబడి విచారణ కొనసాగుతునే ఉన్నాయి. పెండింగ్ లో ఉన్న కేసుల్లో జగన్మోహన్ రెడ్డి కేసులు కూడా ఉన్నాయి.

ప్రత్యేక కోర్టు ఏర్పాటైన దగ్గర నుండి విచారణలోని పురోగతిని రోజువారి తమకు అందచేయాలని కింది కోర్టులను హైకోర్టు ఆదేశించింది. అయితే ఇపుడున్న మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి, సీబీఐ కోర్టు పరిధిలోని ఇతర కోర్టులు, సిటీ సివిల్ కోర్టులు, సిటీ స్మాల్ కాజెస్ కోర్టుల్లో భౌతిక విచారణ చేయటమా ? లేకపోతే వీడియో కాన్ఫెరెన్సు ద్వారా విచారణ చేయటమా ? అన్నది ఇంకా తేలలేదు. ఈ విషయాన్ని హైకోర్టు పరిపాలనా జడ్జీయే నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆదేశించారు.

ప్రస్తుతం ఎంపిలు, ఎంఎల్ఏలుగా ఉన్న వారిలో 25 మంది పై సిబిఐ, ఏసీబీ కోర్టుల్లో విచారణలు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నాయి. వచ్చే నెలలలో విచారణ మొదలవుతోంది కాబట్టి ప్రజా ప్రతినిధులతో పాటు మాజీలకు కూడా వెంటనే సమన్లు ఇచ్చి విచారణకు హాజరయ్యేట్లుగా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఇందులో భాగంగానే వివిధ శాఖల ఉన్నతాధికారులతో హైకోర్టులోని ఉన్నతాధికారులు ప్రత్యేక సమావేశం కూడా ఏర్పాటు చేశారు.

హైకోర్టు తాజా ఆదేశాలతో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడు, సుజనా చౌదరితో పాటు అనేకమంది టీడీపీ ఎంపిలు, ఎంఎల్ఏలతో పాటు మీడియా సంస్ధల యజమానులు కూడా ఉన్నారు. మామూలుగా చాలామంది ప్రజాప్రతినిధులపై ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా చేసే ఆందోళనలు, రైలురోకోల సందర్భంగా నమోదయ్యే కేసులు తదితరాలే ఎక్కువగా ఉంటాయి. కొద్దిమంది మాత్రమే అవినీతి, బ్యాంకుల్లో లోన్లు తీసుకుని ఎగ్గొట్టే కేసులు, భూకబ్జాలు, అత్యాచారం, హత్యాచారంలో ఇరుక్కున్న కేసులుంటాయి. ఏదేమైనా పెండింగ్ లో ఉన్న కేసులను వెంటనే పరిష్కరించాలని అనుకోవటం మంచిదే.