బాబాయ్ పై అమ్మాయి ఫుల్ ఫైర్

బాబాయ్ అశోక్ గజపతిరాజుపై ట్విట్టర్ వేదికగా సంచైతా గజపతిరాజు ఫుల్లుగా ఫైర్ అయ్యారు. మాన్సాస్ ట్రస్టు ఆధ్వర్యంలోని ఎంఆర్ కాలేజి వివాదంలోకి ట్రస్టును అనవసరంగా లాగుతున్నారంటూ ట్రస్టు ఛైర్ పర్సన్ మండిపోయారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే ట్రస్టు ఆధ్వర్యంలో ఎయిడెడ్ హోదాలో ఎంఆర్ కాలేజి నడుస్తోంది. ఈ కాలేజికి సుమారు 150 సంవత్సరాల చరిత్రుంది. విద్యార్ధుల అడ్మిషన్లు, రిజల్ట్స్ విషయంలో కూడా మంచి ట్రాక్ రికార్డు కూడా ఉందని సమాచారం.

దశాబ్దాల నుండి కాలేజీకి ఉన్న ఎయిడెడ్ హోదాను అన్ ఎయిడెడ్ గా మార్చాలంటూ ట్రస్టు తరపున ప్రభుత్వానికి లేఖ వెళ్ళింది. ఎయిడెడ్ విద్యాసంస్ధ అంటే అందులోని సిబ్బంది జీతబత్యాలను ప్రభుత్వమే భరిస్తుంది. కాబట్టి విద్యాసంస్ధకు ఆర్ధికభారం చాలా వరకు తగ్గిపోతుంది. అందుకనే ప్రైవేటు మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ప్రారంభమైన విద్యాసంస్ధలను ఎయిడెడ్ గా మార్చేందుకు యాజమాన్యాలు నానా అవస్తలు పడుతుంటాయి.

అయితే ఎంఆర్ కాలేజి విషయంలో ట్రస్టు ఉల్టాగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు గుప్పుమన్నాయి. ఎప్పుడైతే ట్రస్టు తరపున ప్రభుత్వానికి లేఖ వెళ్ళిందని బయటపడిందో వెంటనే అశొక్ గజపతిరాజుతో పాటు టీడీపీ నేతల సంచైతపై తీవ్రమైన ఆరోపణలు మొదలుపెట్టేశారు. ఇదే విషయమై సంచైత తన బాబాయ్ పై ఫుల్లుగా ఫైర్ అయిపోయారు. ఎయిడెడ్ కాలేజీని అన్ ఎయిడెడ్ గా మార్చాలని ట్రస్టు తరపున లేఖ వెళ్ళలేదంటూ క్లారిటి ఇచ్చారు. కాలేజీ ఎయిడెడ్ హోదాను 2017 లో తన బాబాయ్ ఛైర్మన్ గా ఉన్నపుడే ప్రభుత్వానికి సరెండర్ చేసినట్లు స్పష్టం చేశారు.

తన బాబాయ్ తీసుకున్న నిర్ణయమే ఇప్పుడు కంటిన్యు అవుతోంది కానీ కొత్తగా తాను చేసిందేమీ లేదన్నారు. మరి సంచైత చెబుతున్నదే నిజమైతే అప్పట్లో ఎయిడెడ్ హోదాను సరెండర్ చేస్తు అశోక్ రాసిన లేఖను బయటపెడితే సరిపోతుంది కదా. ట్రస్టు తరపున ప్రభుత్వానికి లేఖ వెళ్ళిందంటే దానికి సంబంధించిన ఫైలు, ప్రభుత్వం జారీ చేసిన జీవో కాపీలు కచ్చితంగా ట్రస్టు ఆఫీసులో ఉంటాయి కదా. వాటిని బయటపెడితే మళ్ళీ టీడీపీ నేతలు నోరెత్తే అవకాశం కూడా ఉండదన్న విషయాన్ని సంచైత మరచిపోయారా ? కాబట్టి సంబంధిత డాక్యుమెంట్లను ఛైర్ పర్సన్ బయటపెడితే వివాదానికి ముగింపు పలికినట్లవుతుంది.