రాహూల్ ను లోకేష్ ఆదర్శంగా తీసుకుంటాడా ?

ఉత్తరప్రదేశ్ లో గురువారం జరిగిన ఓ సంఘటనతో దేశం మొత్తం కాంగ్రెస్ నేత రాహూల్ గాంధి గురించే మాట్లాడుకుంటోంది. ఉత్తరప్రదేశ్ లోని హథ్రస్ లో ఓ అమ్మాయిపై హత్యాచారం జరిగిందనే ఆరోపణలతో రాష్ట్రం అట్టుడుకిపోతోంది. ఈ ఘటన నేపధ్యంలోనే రాహూల్ గాంధీ, ప్రియాంక గాంధీలు హథ్రస్ లో పర్యటించారు. వీళ్ళని నిలుపుదల చేసే ఉద్దేశ్యంతో పోలీసులు అక్కా, తమ్ముళ్ళ విషయంలో ఓవర్ యాక్షన్ చేశారు.

హథ్రస్ లో ఘటన జరిగిన ప్రాంతానికి, బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా పోలీసులు వీళ్ళని అడ్డుకున్నారు. వీళ్ళతో పాటు నేతలు, వందలాది మంది కార్యకర్తలను కూడా పోలీసులు అడ్డుకున్నపుడు పెద్ద గొడవే అయ్యింది. ఈ నేపధ్యంలోనే పోలీసులు దురుసుగా ప్రవర్తించటంతో రాహూల్ రోడ్డుపై పడిపోయారు. ఎవరు ఊహించనిరీతిలో రాహూల్ గాంధీ రోడ్డుపై పడిపోవటంతో అందరు నిశ్చేష్టులయ్యారు. తర్వాత నేతలు, కార్యకర్తలు పోలీసులపై తిరగబడిన ఘటన దేశం మొత్తాన్ని ఆకర్షించింది. ఒక్కసారిగా రాహూల్ వార్తల్లో వ్యక్తిగా మారిపోయాడు.

సీన్ కట్ చేస్తే ఏపిలో లోకేష్ కు రాహూల్ కు ఇపుడు పోలిక పెరిగిపోతోంది. ఎందుకంటే కాస్త అటు ఇటుగా లోకేష్, రాహూల్ పైనా రాజకీయంగా ఒకే ముద్రుంది. ఇద్దరినీ గిట్టని వాళ్ళు పప్పూ అనే విమర్శలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఒకే ఘటనతో రాహూల్ ను అందరు ఇపుడు చాలా ధైర్యం చేశాడే అనంటున్నారు. మరి లోకేష్ కూడా రాహూల్ ల్లాగ ఎప్పుడు ధైర్యం చేస్తాడని పార్టీ నేతలు, శ్రేణులు ఎదురు చూస్తుంటారు. ప్రజా వ్యతిరేక పాలన సాగుతోందంటూ 24 గంటలూ ట్విట్టర్లో జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు, విమర్శలు చేస్తుంటే లోకేష్ కు ఏమొస్తుంది ? చంద్రబాబునాయుడు అంటే 71 ఏళ్ళలో ఉన్నారు కాబట్టి కరోనా వైరస్ కు భయపడి ఇంట్లోనే కూర్చున్నారంటే అర్ధముంది.

40 ఏళ్ళ వయస్సులో ఉన్న లోకేష్ కూడా ఇంటికి, ట్విట్టర్ కే పరిమితమైపోతే ఎలా ? ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన చేస్తోందని అనిపించినపుడు రోడ్లమీదకు రావాలి ఉద్యమాలు చేయాలి. అప్పుడే ఇబ్బందుల్లో ఉన్న పార్టీకి, నిసత్తవుగా ఉన్న నేతల్లో మంచి జోష్ నింపినట్లవుతుంది. లోకేష్ కూడా రాష్ట్రంలో పర్యటనలు చేయాలి. జిల్లాల్లోని నేతలను వాళ్ళ ప్రాంతాలకే వెళ్ళి కలవాలి.

రాష్ట్రంలో సమస్యలున్నాయని అనుకున్నపుడు సమస్య ఉన్న చోటికి వెళ్ళ ఉద్యమాలు చేస్తేనే జనాలను ఆకుట్టుకోగలరన్న విషయాన్ని లోకేష్ గుర్తుంచుకోవాలి. బాధితులను వాళ్ళ దగ్గరకే వెళ్ళి కలవాలి కానీ ట్విట్టర్లో పోస్టులు పెడితే ఉపయోగం ఉండదని లోకేష్ గ్రహించాలి. మరి రాహూల్ ను చూసిన తర్వాతైనా లోకేష్ తన రాజకీయాన్ని మార్చుకుంటారా ?