ఏపీ సర్కారుకు హైకోర్టు సివియర్ వార్నింగ్

రాష్ట్రంలో రోజురోజుకు ప్రభుత్వానికి, న్యాయవ్యవస్ధకు మధ్య అగాధం పెరిగిపోతున్నట్లే ఉంది. జడ్జీలు, న్యాయమూర్తుల పనితీరుపై అధికార పార్టీలోని కొందరు మంత్రులు, నేతలు చాలా ఘాటుగా కామెంట్లు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో హైకోర్టు జోక్యం చేసుకోవటం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా కేసులు వేస్తే వెంటనే అడ్మిట్ చేసుకుంటోంది హైకోర్టు.

పరిపాలనా సంబంధిత విషయాల్లోనే కాకుండా వివిధ అవినీతి ఆరోపణలపై విచారణలు ముందుకు సాగకుండా హైకోర్టు కొన్ని కేసుల్లో స్టేలు ఇచ్చేస్తోంది. విజయవాడలోని స్వర్ణా ప్యాలెస్ కోవిడ్ సెంటర్లో అగ్నప్రమాదంపై యాజమాన్యం డాక్టర్ పోతిన రమేష్ పై కేసు పెట్టి విచారణ చేయాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. దీన్ని రమేష్ కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకున్నారు.

అలాగే అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనే ఆరోపణలపై ఏసిబి కేసులు పెట్టి విచారణకు రెడి అయితే వెంటనే కోర్టు స్టే ఇచ్చేసింది. ఇటువంటి అనేక అంశాలపై ప్రభుత్వం కూడా హైకోర్టు వైఖరిపై చాలా అసంతృప్తితో ఉంది. అంటే హైకోర్టు, ప్రభుత్వం మధ్య సంబంధాలు నివురు గప్పిన నిప్పులాగ ఉందని చెప్పటంలో సందేహమే లేదు. ఇటువంటి నేపధ్యంలోనే హై కోర్టులో జరిగిన ఓ కేసు విచారణ సందర్భంగా రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా సక్రమంగా అమలు కాకపోతే ఇతర అధికారాలను ఉపయోగించాల్సుంటుందని హైకోర్టు తాజాగా చేసిన హెచ్చరిక సంచలనంగా మారింది.

న్యాయవ్యవస్ధపై నమ్మకం లేదా అంటూ ప్రభుత్వాన్ని సూటిగా నిలదీసిందంటే వ్యవహారం ఎంతవరకు చేరుకుందో అర్ధమైపోతోంది. పార్లమెంటుకు వెళ్ళి హైకోర్టును మూసేయమని అడగండి అంటూ చాలా ఘాటుగా కామెంట్ చేసింది. అంటే ఈమధ్య ముగిసిన పార్లమెంటు సమావేశాల్లో హైకోర్టు వైఖరిపై వైసిపి ఎంపిలు డైరెక్టుగానే ఆరోపణలు, విమర్శలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. బహుశా ఎంపిల ఆరోపణలు, విమర్శలను దృష్టిలో పెట్టుకునే హైకోర్టును మూసేయమని పార్లమెంటులో అడగమని చెప్పినట్లుంది.

న్యాయవ్యవస్ధపైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారా ? న్యాయవ్యవస్ధ ప్రతిష్టను దిగజార్చటాన్ని ఎట్టి పరిస్ధితుల్లోను సహించేది లేదంటూ తీవ్రంగా హెచ్చరించింది. హైకోర్టుపైన చేసిన వ్యాఖ్యల వెనుక ఏదైనా కుట్రుందేమో తేల్చేస్తానంటూ చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. గతంలో ఎప్పుడూ లేనట్లుగా జడ్జీలపై వచ్చిన ఆరోపణలతో హైకోర్టే పిటీషన్ వేసుకోవాల్సొచ్చిందని కామెంట్ చేయటమే ఆశ్చర్యంగా ఉంది. జ్యుడీషియరీ బలహీనమైతే సివిల్ వార్ తప్పదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయటమే విచిత్రంగా ఉంది.