విచార‌ణ‌కు రండి.. : దువ్వాడ‌కు తిరుప‌తి పోలీసుల పిలుపు

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, ఆయ‌న ప్రేమికురాలు, స‌హ‌చ‌రి దివ్వెల మాధురికి తిరుప‌తి ఈస్ట్ పోలీసు స్టేష‌న్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచార‌ణ‌కు రావాల‌ని వారు కోరారు. ఈ నెల 21-23 మ‌ధ్య విచార‌ణ‌కు రావాల‌ని నోటీసుల‌లో పేర్కొన్నారు. ఈ మేర‌కు తిరుప‌తి నుంచి ప్ర‌త్యేకంగా శ్రీకాకుళానికి వ‌చ్చిన ముగ్గురు స‌భ్యుల‌తో కూడిన పోలీసు బృందం వీరికి వేర్వేరుగా ’41 ఏ’ నోటీసులు ఇచ్చారు. వీటిని వారు తీసుకున్న‌ట్టు తెలిసింది.

ఏంటీ కేసు!

ఇటీవ‌ల తిరుమ‌ల శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా.. శ్రీవారి ద‌ర్శ‌నానికి దువ్వాడ శ్రీనివాస్‌, మాధురిలు క‌లిసి వెళ్లారు. అయితే.. సైలెంట్‌గా స్వామివారి ద‌ర్శ‌నం చేసుకుని వ‌చ్చేస్తే.. ఇబ్బంది ఉండేది కాదు. అయితే.. కొండ‌పైనే వీఐపీ గ్యాల‌రీలోనే వారు యూట్యూబ్ వీడియోలు తీయించ‌డం.. అదేవిధంగా రీల్స్ కూడా చేయించ‌డం.. వంటివి వివాదానికి దారితీశాయి. ఫొటోల‌కు ఫోజులు కూడా ఇచ్చారు. అనంత‌రం మాధురి.. అక్క‌డే మీడియాతో మాట్లాడుతూ.. త‌మ పెళ్లికి సంబంధించిన విష‌యాలు కూడా పంచుకున్నారు.

దీంతో వీరి వ్య‌వ‌హారంపై తిరుమ‌ల ఈవో జె. శ్యామ‌ల‌రావుకు ఫిర్యాదులు అందాయి. ప‌విత్ర‌మైన పుణ్య క్షేత్రాన్ని ప‌ర్యాట‌క ప్రాంతంగా మార్చి.. ఫొటోలు , వీడియోలు తీసుకున్నార‌ని.. అదేవిధంగా పెళ్లి, విడాకులు అంటూ.. వ్యాఖ్య‌లు చేశార‌ని కూడా కొంద‌రు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయ‌న ఈ కేసును తిరుప‌తి ఈస్ట్ పోలీసుల‌కు అప్ప‌గించేలా విజిలెన్స్‌ను ఆదేశించారు. తిరుమ‌ల విజిలెన్స్ వ‌ర్గాల ఆదేశాలతో ఈ కేసును ఈస్ట్ పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా వారికి.. 41ఏ నోటీసులు ఇచ్చారు.

ప్రొటోకాల్ ద‌ర్శ‌నంపై కూడా..

మ‌రోవైపు..తిరుమ‌ల‌కు వ‌చ్చిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, ఆయ‌న ప్రేమికురాలు మాధురికి ప్రొటోకాల్ ద‌ర్శ‌నం క‌ల్పించే విష‌యంలో తిరుమ‌ల అధికారులు కొంద‌రు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించార‌న్న ఫిర్యాదులు అందాయి. బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రుగుతున్న స‌మ‌యంలో ప్రొటోకాల్ ద‌ర్శ‌నాల‌ను ప‌రిమితంగా అనుమ‌తించారు. ఇలాంటి స‌మ‌యంలో దువ్వాడ‌కు ఇచ్చే విష‌యాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. అయితే.. మీడియాలో వీటిపై క‌థ‌నాలు రావ‌డంతో స‌ద‌రు అధికారుల‌పైనా అంత‌ర్గ‌త విచార‌ణ చేప‌ట్టారు.