ఎల్‌సీయూ హీరోలందరితో ఓ సినిమా

ఇండియన్ సినిమాలో మల్టీవర్స్, సినిమాటిక్ యూనివర్శ్ లాంటి పదాలు బాగా పాపులర్ అయ్యేలా చేసిన ఘనత తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్‌దే. తాను తీసే సినిమాల్లో ఒకదానితో మరొకదానికి కనెక్షన్ పెడుతూ.. పాత్రలను  అనుసంధానం చేస్తూ అతను ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని అందించాడు. మా నగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్.. ఈ నాలుగు సినిమాల్లో కథాంశం డ్రగ్స్ చుట్టూనే తిరుగుతుంది. కథతో పాటు పాత్రల్లోనూ ఒక కనెక్షన్ కనిపిస్తుంది.

దీంతో ‘లోకేష్ సినిమాటిక్ యూనివర్స్’ (ఎల్‌సీయూ)కు మంచి హైప్ వచ్చి ‘లియో’ రిలీజైనపుడు దాని గురించి చాలా మాట్లాడుకున్నారు. కానీ దీనికి ‘ఎల్‌సీయూ’తో పెద్దగా కనెక్షన్ కనిపించలేదు. ఒక పాత్ర.. చివర్లో ఓ డైలాగ్‌తో కనెక్ట్ చేయడానికి ప్రయత్నించారు కానీ అది పెద్దగా వర్కవుట్ కాలేదు. మరి లోకేష్ కొత్త చిత్రం ‘కూలీ’ ఎల్‌సీయూలో భాగమా కాదా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ విషయంలో లోకేష్ స్వయంగా క్లారిటీ ఇచ్చేశాడు.

‘కూలీ’ ఎల్‌సీయూలో భాగం కాదని.. ఇది ఒక స్టాండ్ అలోన్ మూవీ అని అతను తేల్చేశాడు. ఐతే తానేమీ ‘ఎల్‌సీయూ’ను విడిచిపెట్టేయలేదని.. దాంతో కనెక్ట్ చేస్తూ ఓ భారీ చిత్రం తీయబోతున్నానని లోకేష్ ప్రకటించాడు. ‘‘కూలీ ఎల్‌సీయూలో భాగం కా3దు. ఆ సినిమా తర్వాత అదిరిపోయేక ప్రాజెక్ట్ వస్తుంది. అందులో ఎల్‌సీయూలో భాగమైన హీరోలందరితో కలిసి తీస్తా’’ అని లోకేష్ తెలిపాడు. ‘లోకేష్’ నుంచి విక్రమ్-2, ఖైదీ-2, లియో-2 సినిమాలు రావాల్సి ఉంది.

కానీ వీటిలో ఏది ఉంటుందో ఏది ఉండదో స్పష్టత లేదు. వీటితో పాటు ‘విక్రమ్’ విలన్‌ పాత్ర రోలెక్స్ మీద ఓ సినిమా తీస్తానని ప్రకటించాడు లోకేష్. మరి ఇప్పుడేమో ‘ఎల్‌సీయూ’ హీరోలందరితో సెపరేట్ సినిమా అంటున్నాడు. మరి ముందు అనౌన్స్ చేసిన సినిమాల సంగతేంటో.. దీని పరిస్థితి ఏంటో చూడాలి. ‘కూలీ’ వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుుక రానుంది. బంగారం స్మగ్లింగ్ నేపథ్యంలో నడిచే ఈ చిత్రంలో రజినీతో పాటు అక్కినేని నాగార్జున, ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు.