సప్త సాగరాల భామకు సుడి తిరిగింది

గత ఏడాది విడుదలైన సప్తసాగరాలు దాటి సైడ్ ఏ, బిలో హీరోయిన్ గా నటించిన రుక్మిణి వసంత్ ఎలాంటి గ్లామర్ షో చేయకపోయినా నటనతోనే బోలెడు అభిమానులను సంపాదించుకుంది. క్యూట్ లుక్స్ తో పాటు పక్కింటి అమ్మాయిలా అనిపించే అందం ఫ్యాన్స్ ని తీసుకొచ్చింది.

పెర్ఫార్మన్స్ ప్రాధాన్యం ఉండే సినిమాల్లో నటించేందుకు ప్రాధాన్యం ఇస్తున్న రుక్మిణి వసంత్ కు టాలీవుడ్ ఎంట్రీకి సరైన ప్లానింగ్ తోనే వస్తోంది. నిఖిల్ తో చేసిన తన డెబ్యూ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ ఈ నెలాఖరు దీపావళి పండగ సందర్భంగా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఇది ఎప్పుడో ఒప్పుకున్న సినిమా.

అసలు కిక్ ఇచ్చే న్యూస్ ఇది కాదు. జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కబోయే ప్యాన్ ఇండియా మూవీలో రుక్మిణి వసంత్ దాదాపుగా లాకైనట్టుగా వచ్చిన వార్త ఫ్యాన్స్ ని ఆనందంలో ముంచెత్తుతోంది. నీల్ కథ అందించిన శ్రీమురళి ‘బఘీరా’లో తనే కథానాయిక.

ఇది కాకుండా శివ కార్తికేయన్, శివ రాజ్ కుమార్, విజయ్ సేతుపతిలతో చెరో సినిమా చేస్తోంది. ఇప్పుడు తారక్ తో కనక ప్రాజెక్టు లాక్ అయితే వీటన్నింటికి మించి డబుల్ ప్రమోషన్ దక్కినట్టేనని చెప్పాలి. కెజిఎఫ్, సలార్ కన్నా మెరుగైన హీరోయిన్ పాత్ర నీల్ తారక్ డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) కోసం డిజైన్ చేశాడట.

నిజానికి రుక్మిణి వసంత్ కు రవితేజ సినిమా కూడా దక్కుండాల్సింది. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ తొలుత మాస్ మహారాజాతో చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. కానీ కథ గురించో ఇంకేదైనా కారణమో తెలియదు కానీ ఆ సినిమా చేతులు మారి రవితేజ వద్దనుకున్నారు. లేదంటే రుక్మిణి వసంత్ ఆ కాంబోలో కూడా ఉండేది. సరే ఏదైతేనేం మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించడం కన్నా లక్కీ ఛాన్స్ ఇంకేముంటుంది. ప్రస్తుతం వార్ 2 బ్యాలన్స్ పూర్తి చేయడం కోసం ఎదురు చూస్తున్న తారక్ ప్రశాంత్ నీల్ సినిమాని జనవరి నుంచి మొదలుపెట్టొచ్చట. 2025 ద్వితీయార్థంలో దేవర 2 స్టార్ట్ చేయొచ్చు.