దృశ్యం కథను ముగించేయబోతున్నారు

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బెస్ట్ థ్రిల్లర్ల లిస్టు తీస్తే.. అందులో మలయాళ చిత్రం ‘దృశ్యం’  అగ్ర భాగాన ఉంటుంది. భాషా భేదం లేకుండా అందరూ ఈ కథను ఆదరించారు.

మలయాళంలో బ్లాక్ బస్టర్ అయ్యాక తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, బెంగాలీ భాషల్లో ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తే అన్ని చోట్లా ఘనవిజయం సాధించింది. చైనీస్, సింహళీస్ లాంటి విదేశీ భాషల్లో సైతం ఈ చిత్రం రీమేక్ అయి మంచి ఫలితాన్ని అందుకోవడం విశేషం.

‘దృశ్యం’కు కొనసాగింపుగా మోహన్ లాల్-జీతు జోసెఫ్ జోడీ ‘దృశ్యం-2’ తీస్తే అది కూడా అద్భుత స్పందన తెచ్చుకుంది. కరోనా టైంలో నేరుగా ఓటీటీలో రిలీజై ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. దీనికి కొనసాగింపుగా ‘దృశ్యం-3’ కూడా ఉంటుందనే సంగతి ముందే ఖరారైంది. ఇప్పుడీ సినిమాను అధికారికంగానే ప్రకటించారు. వచ్చే ఏడాది చివర్లో దృశ్యం-3’ ప్రేక్షకుల ముందుకు రానుందట.

మలయాళ ఫిలిం మేకర్స్, నటులు పెద్దగా టైం తీసుకోకుండా చకచకా సినిమాలు లాగించేస్తుంటారు. ప్రస్తుతం మోహన్ లాల్, జీతు జోసెఫ్ వేర్వేరు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది ఈ సినిమాను ఈ జోడీ సెట్స్ మీదికి తీసుకెళ్తుందట. క్రిస్మస్‌కు దృశ్యం-3ని రిలీజ్ చేస్తారట.

ఐతే ఈసారి ప్రత్యేకత ఏంటంటే.. ‘దృశ్యం’ కథను ఇంతటితో ముగించేయబోతున్నారు. ఇంకో పార్ట్ అంటే సాగతీతగా అనిపిస్తుందని.. కాబట్టి మూడో పార్ట్‌తో సినిమాను ముగించేయాలని లాల్, జీతు ఫిక్సయ్యారట.

ముగిసిందనుకున్న మర్డర్ కేసును రీ ఓపెన్ చేసి మళ్లీ తనను, తన కుటుంబాన్ని ఇరుకున పెట్టాలని చూసిన పోలీసులను తన మాస్టర్ ప్లాన్‌తో హీరో ఎలా బోల్తా కొట్టించాడో ‘దృశ్యం-2’లో అద్భుతంగా చూపించాడు జీతు. మరి ఈసారి కేసును పోలీసులు ఎలా ముందుకు తీసుకెళ్తారు.. దానికి హీరో కౌంటర్ ఎటాక్ ఎలా ఉంటుందని.. ఈ కథకు ముగింపు ఎలా ఉంటుంది అన్నది ఆసక్తికరం.