మాస్ మహారాజా అంత రిస్క్ చేస్తారా

వేగంగా సినిమాలు చేయడంలో కుర్ర హీరోలతో పోటీ పడే మాస్ మహారాజా రవితేజ ఫలితాలను అంత సీరియస్ గా తీసుకోరు. అందుకే వరసగా నాలుగు డిజాస్టర్లు పడ్డాయి. ధమాకా బ్లాక్ బస్టరయ్యాక ఫ్యాన్స్ కు ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. వాల్తేరు వీరయ్య విజయంలో చిరంజీవికి షేర్ ఉంది కాబట్టి దాన్ని పూర్తి పరిగణనలోకి తీసుకోలేకపోయారు. ఆ తర్వాత రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ ఒకదాన్ని మించి మరొకటి హ్యాట్రిక్ ఫ్లాపులుగా నిలిచాయి. వీటికి మంచి ఓపెనింగ్స్ తో పాటు డీసెంట్ వసూళ్లు దక్కాయి. కానీ మిస్టర్ బచ్చన్ మరీ అన్యాయం. రెండో రోజే చేతులు ఎత్తేసింది.

ఈ నేపథ్యంలో రవితేజ వేయబోయే ప్రతి అడుగు జాగ్రత్తగా ఉండాలని అభిమానుల కోరిక. దానికి అనుగుణంగానే సామజవరగమన రచయిత భాను భోగవరపుకు డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చారు. సగం షూటింగ్ అయ్యాక ప్రమాదానికి గురి కావడంతో రెండు నెలలు రెస్టు తీసుకోవాల్సి వచ్చింది. ఈ గ్యాప్ లోనే కొన్ని కొత్త కథలు విన్నట్టు ఫిలిం నగర్ టాక్. వాటిలో తమిళ దర్శకుడు సి సుందర్ చెప్పిన లైన్ మాస్ రాజాకు నచ్చిందట. ఒకప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ తో అరుణాచలం లాంటి సూపర్ హిట్ ఇచ్చిన సి సుందర్ కొన్నేళ్లుగా హారర్ సిరీస్ అరణ్మయి తప్ప చెప్పుకోదగ్గ సినిమాలు చేయలేదు.

కమర్షియల్ గా వర్కౌట్ చేస్తున్నారు కానీ పెద్ద తమిళ హీరోలు ఈయన్ని దూరం పెట్టారు. విశాల్ కోరి యాక్షన్ అనే ఆఫర్ ఇచ్చాడు కానీ అదీ ఆడలేదు. ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న సి సుందర్ ఎలాంటి కథ చెప్పి ఉంటాడో ఊహించుకోవడం కష్టం కానీ కాంబో మాత్రం రిస్కుతో కూడుకున్నదే. ప్రస్తుతానికి గాసిప్పే తప్ప ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కెవి అనుదీప్ చెప్పిన స్టోరీని మొదట్లో సానుకూలంగా స్పందించి ఫైనల్ వెర్షన్ నచ్చక వదులుకున్న రవితేజ ఎవరితో అయినా అంత సులభంగా రాజీ పడకపోవచ్చు. ప్రస్తుతం సితార ఎంటర్ టైన్మెంట్స్ లో భాను భోగవరపుతో చేసున్న సినిమా 2025 వేసవిలో విడుదల కావొచ్చు.