జానీ.. జాతీయ అవార్డు తీసుకోబోతున్నాడు

ఇండియాలోనే టాప్ కొరియోగ్రాఫర్లలో ఒకడిగా ఎదిగిన జానీ మాస్టర్.. గత నెలలో పెద్ద వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తన దగ్గర ఆరేళ్ల పాటు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేసిన ఓ అమ్మాయి.. తనపై తీవ్ర స్థాయిలో లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ కేసు పెట్టడం సంచలనం రేపింది.

ఈ కేసు నమోదయ్యాక కొన్ని రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్న జానీ.. తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. కోర్టు అతడికి రిమాండ్ విధించింది. బెయిల్ కోసం వెంటనే చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఐతే ఇప్పుడు జానీకి బెయిల్ లభించింది.

కానీ అది పూర్తి స్థాయి బెయిల్ కాదు. కేవలం నాలుగు రోజుల మధ్యంతర బెయిల్ మాత్రమే ఇచ్చింది జానీకి కోర్టు. జాతీయ అవార్డుల వేడుకలో పాల్గొనాల్సి రావడమే ఇందుక్కారణం.

తమిళ చిత్రం ‘తిరు చిత్రాంబళం’కు గాను జానీ మరొక మాస్టర్‌తో కలిసి జాతీయ పురస్కారం గెలుచుకున్న సంగతి తెలిసిందే. తన కెరీర్లో ఇది అత్యున్నత అవార్డు. దీంతో తన పేరు జాతీయ స్థాయిలో మార్మోగింది. కానీ కొన్ని వారాలకే లైంగిక వేధింపుల కేసులో చిక్కుకుని జైలు పాలయ్యాడు.

ఇంతకుముందు బెయిల్ కోసం ప్రయత్నించినపుడు తిరస్కరించిన కోర్టు.. ఇప్పుడు జాతీయ అవార్డుల వేడుక కోసం జానీకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకే ఈ బెయిల్ ఉంటుంది.

ఈ సమయంలో అతను ఢిల్లీకి వెళ్లి జాతీయ అవార్డుల వేడుకలో పాల్గొని వస్తాడు. ఐతే ఎంతో సంతోషంగా, గర్వంగా జాతీయ అవార్డుల వేడుకలో పాల్గొని పురస్కారం స్వీకరించాల్సిన జానీ.. ఇప్పుడీ కేసు మూలంగా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఆ వేడుకకు వెళ్తున్నాడు. తన జీవితం ఇలా మలుపు తిరుగుతుందని అతను ఊహించి ఉండడు. ఈ కేసులో మున్ముందు అతనెలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో చూడాలి.