సినిమా వాళ్లను వేధించం-పవన్

కొంత విరామం తర్వాత ట్విట్టర్లో పవన్ కళ్యాణ్ యాక్టివ్ అయ్యారు. తిరుమల లడ్డు వివాదం విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్లు వేయడం తెలిసిందే. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని సూచించడం.. అలాగే జరిగిన అపరాచానికి ప్రాయశ్చిత్తంగా దీక్ష కూడా చేయబోతున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశమైంది. దీంతో పాటు ఆయన ‘దేవర’ టీంకు శుభాకాంక్షలు చెబుతూ ఒక ట్వీట్ వేయడం విశేషం.

‘దేవర’ మూవీకి ఏపీలో అదనపు షోలు వేసుకోవడానికి, అలాగే టికెట్ల ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘దేవర’ నిర్మాతలు చంద్రబాబుతో పాటు పవన్‌కు కృతజ్ఞతలు చెబుతూ ‘ఎక్స్’లో పోస్టులు పెట్టారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ వేసిన ట్వీట్‌కు పవన్ బదులిచ్చారు.

ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వం సినిమా వాళ్లను వేధించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. తమ ప్రభుత్వం అలా చేయదని పవన్ స్పష్టం చేశారు. “చంద్రబబు నాయుడు గారి నేతృత్వంలో ఏపీలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం తెలుగు సినిమా పరిశ్రమకు అంతా మంచే జరగాలని కోరుకుంటుంది. వ్యక్తుల రాజకీయ సంబంధాలతో సంబంధం లేకుండా వ్యవహరిస్తుంది. మేం దీన్ని గౌరవిస్తాం. వైసీపీ ప్రభుత్వంలాగా దిగజారి పోయి నటులు, ఫిలిం మేకర్స్‌ను వేధించం” అని పవన్ పేర్కొన్నాడు.

అలాగే వచ్చే శుక్రవారం విడుదల కానున్న దేవర సినిమాకు ఆయన శుభాకాంక్షలు కూడా చెప్పారు. టికెట్ల రేట్లు పెంపు, అదనపు షోలకు అనుమతులు ఇచ్చినందుకు ‘దేవర’ హీరో జూనియర్ ఎన్టీఆర్ సైతం చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ వేసిన సంగతి తెలిసిందే. తారక్ అలా ట్వీట్ వేయడం.. మరోవైపు పవన్ ఇలా స్పందించడం ట్విట్టర్లో చర్చనీయాంశమైంది.