పవన్ మాట వరసకు అంటే..

టాలీవుడ్లో మళ్లీ బండ్ల గణేష్ హడావుడి మొదలైంది. తన ‘దేవుడు’ పవన్ కళ్యాణ్‌తో మళ్లీ ఓ సినిమాను నిర్మించబోతున్నట్లు బండ్ల ప్రకటించడం హాట్ టాపిక్‌గా మారింది. ‘ఆంజనేయులు’ లాంటి ఫ్లాప్ మూవీతో నిర్మాతగా మారిన బండ్ల గణేష్‌ను ‘తీన్ మార్’తో పెద్ద నిర్మాతను చేసింది పవన్ కళ్యాణే. ఆ సినిమా సరిగా ఆడలేదని తర్వాత ‘గబ్బర్ సింగ్’ ఇచ్చాడు పవన్. ఆ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసి బండ్లను ‘బ్లాక్‌బస్టర్’ ప్రొడ్యూసర్‌గా మార్చింది. ఆ ఊపులో మరి కొన్ని సినిమాలు నిర్మించి తర్వాత ఉన్నట్లుండి ప్రొడక్షన్ ఆపేశాడు.

ఇప్పుడు మళ్లీ సినిమాలు నిర్మించాలనే నిర్ణయానికి వచ్చిన బండ్ల.. టాలీవుడ్ టాప్ స్టార్లను దువ్వే ప్రయత్నంలో ఉన్నాడు. కానీ ఎవరూ అతడికి కమిట్మెంట్ ఇవ్వలేదు. ఇంతలో పవన్ కళ్యాణ్‌ తనతో సినిమా చేయడానికి ఓకే చెప్పాడంటూ అప్ డేట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు బండ్ల.

ఐతే పవన్ సన్నిహితుల సమాచారం ప్రకారం బండ్లతో ఆయన సినిమా కార్యరూపం దాల్చడం అంత సులువేమీ కాదంటున్నారు. ఆయనకు ఇప్పటికే బోలెడన్ని కమిట్మెంట్లున్నాయి. 2024 ఎన్నికలకు ముందు ఇప్పటికే కమిటైన సినిమాలను పూర్తి చేయడం కూడా కష్టమే అన్నది వారి అభిప్రాయం. రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’నే ఇంకా పూర్తి చేయలేదు. ఆ తర్వాత క్రిష్ మూవీ, ఆపై హరీష్ శంకర్ చిత్రం.. తర్వాత సురేందర్ రెడ్డి సినిమా చేయాలి. వీటికే రెండేళ్లకు పైగా సమయం పడుతుంది.

ఇవి కాక ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ సంస్థ ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్‌ను కూడా పవన్ ముందుకు తేగా.. దాన్ని కూడా చేస్తానన్నట్లు సంకేతాలు ఇచ్చాడు పవన్. ఈ ఐదు సినిమాలను పూర్తి చేశాక కానీ బండ్లతో సినిమా చేయడానికి వీల్లేదు. ఐతే తాను మళ్లీ సినిమాలు నిర్మించాలనుకుంటున్నానంటూ పవన్ దగ్గర ప్రస్తావించి కమిట్మెంట్ కోరితే చూద్దాం, చేద్దాం అని పవన్ మాట వరసకు అంటే బండ్ల తొందరపడి ప్రకటన చేసేశాడని.. అసలు తన కోసం పవన్ ఎప్పటికి అందుబాటులోకి వస్తాడో తెలియదు, ఆ టైమింగ్‌ను బట్టి దర్శకుడిని, కథను సిద్ధం చేసుకోవాలి. ఇవన్నీ అంత తేలిగ్గా తేలే విషయాలు కాదని ఇండస్ట్రీ జనాలు అంటున్నారు.