మళ్లీ ఫిలిం సిటీకి రాజమౌళి

రాజమౌళి ‘బాహుబలి’ అనే భారీ కలను కని, దానికి దృశ్య రూపం ఇవ్వడంలో ఎంతో తోడ్పాటు అందించిన ప్రదేశం.. రామోజీ ఫిలిం సిటీ. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఈ ఫిలిం స్టూడియోలో సినిమా చిత్రీకరణకు లేని సౌకర్యం లేదు.

ఎంత భారీ ప్రదేశం కావాలన్నా.. ఎంత పెద్ద సెట్ వేయాలన్నా.. ఎంతమందిని అకామొడేట్ చేయాలన్నా ఫిలిం సిటీలో ఢోకా ఉండదు. పైగా జనాలతో ఇబ్బంది అసలే ఉండదు. ప్రశాంతంగా ఎన్ని రోజులైనా చిత్రీకరణ జరుపుకోవచ్చు.

కాకపోతే వేరే స్టూడియోలతో పోలిస్తే ఇక్కడ ఖర్చు, రూల్స్ కొంచెం ఎక్కువ అన్నదే కంప్లైంట్. ఇక్కడే మాహష్మతి సామ్రాజ్యానికి సంబంధించి భారీ సెట్ వేసి ‘బాహుబలి’ మెజారిటీ షూట్ జరిపాడు జక్కన్న. అన్ని రకాల అద్దెల కింద ఫిలిం సిటీకి మాత్రమే బడ్జెట్లో ఒక పావు వంతు నిర్మాతలు ఇచ్చి ఉంటారని అంటారు. ఈ క్రమంలోనే రామోజీరావుతో జక్కన్నకు ఎంతో సాన్నిహిత్యం కూడా ఏర్పడింది.

కానీ మధ్యలో ఏం జరిగిందో ఏమో.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం ఫిలిం సిటీకి వెళ్లలేదు జక్కన్న. ‘బాహుబలి’ బిల్స్, డిజిటల్ డీల్స్ విషయంలో ఎక్కడో చిన్న విభేదాలు వచ్చాయని.. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణ పూర్తిగా బయటే చేశారని.. ఫిలిం సిటీకి వెళ్లలేదని అంటారు.

ఆ ప్రచారంలో ఎంత వరకు నిజం ఉందో కానీ.. ఇప్పుడు మాత్రం జక్కన్న చూపు తిరిగి ఫిలిం సిటీ మీద పడ్డట్లు సమాచారం. మహేష్ బాబుతో తాను చేయబోయే కొత్త చిత్రం షూట్ చాలా వరకు ఫిలిం సిటీలోనే చేయబోతున్నారట. ఇందుకోసం అక్కడ సెట్ వర్క్స్ కూడా జరుగుతున్నట్లు సమాచారం.

కొన్ని నెలల కిందటే రామోజీ రావు మరణించడం.. ఆయన మీద రాజమౌళి తన గౌరవ భావాన్ని చాటడం తెలిసిందే. ఏవైనా పంతాలు ఉన్నా అవి రామోజీ మరణంతోనే పక్కకు వెళ్లిపోయి ఉంటాయి. దీంతో మళ్లీ ఫిలిం సిటీలో షూట్‌కు జక్కన్న రంగం సిద్ధం చేసుకుంటున్నాడట. జనవరి నుంచే ఈ సినిమా చిత్రీకరణ మొదలవుతుందని అంటున్నారు.