తెలుగు చిత్రసీమకు సరిలేరు వేరెవ్వరు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను వరదలు ముంచెత్తడం యావత్ తెలుగు ప్రజల హృదయాలను కదిలించింది. ఉగ్రరూపం దాల్చిన ప్రకృతి విలయానికి వేలల్లో బాధితులు మిగిలారు. ఈ విపత్కాల సమయంలో ప్రభుత్వాలు చక్కని చర్యలు తీసుకుంటూ ఉండగా ఇంకోవైపు టాలీవుడ్ హీరోలు, సెలబ్రిటీలు, నిర్మాణ సంస్థలు దాతృత్వంలో తమకు ఎవరూ సాటిరారని ఋజువు చేసుకుంటున్నారు. కేరళ ఫ్లడ్స్ వచ్చినప్పుడు సైతం మనవాళ్ళు ధారాళంగా విరాళాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఇంత జరుగుతున్నా తమిళ, మలయాళ హీరోల నుంచి కనీస స్పందన సానుభూతి రూపంలో రాకపోవడం గమనార్హం.

ఇప్పటిదాకా ఇచ్చిన వాళ్లలో పవన్ కళ్యాణ్ (6 కోట్లు), ప్రభాస్ (2 కోట్లు), చిరంజీవి (1 కోటి), బాలకృష్ణ (1 కోటి), నాగార్జున (1 కోటి), మహేష్ బాబు (1 కోటి), జూనియర్ ఎన్టీఆర్ (1 కోటి), అల్లు అర్జున్ (1 కోటి), రామ్ చరణ్ (1 కోటి), ఫిలిం ఛాంబర్ (50 లక్షలు), హారికా హాసిని (50 లక్షలు), మైత్రి మేకర్స్ (50 లక్షలు), దిల్ రాజు సంస్థ (50 లక్షలు), వైజయంతి మూవీస్ (45 లక్షలు), సిద్ధూ జొన్నలగడ్డ (30 లక్షలు), సాయి ధరమ్ తేజ్ (25 లక్షలు), తెలుగు నిర్మాతల సమాఖ్య (20 లక్షలు), వరుణ్ తేజ్ (15 లక్షలు), తెలుగు ఫిలిం ఫెడరేషన్ (10 లక్షలు), విశ్వక్ సేన్ (10 లక్షలు), వెంకీ అట్లూరి (10 లక్షలు), అంబికా కృష్ణ (10 లక్షలు), అలీ (6 లక్షలు), అనన్య నాగళ్ళ (5 లక్షలు) ఉన్నారు.

ఇంకా డొనేషన్లు ఇచ్చేవాళ్ళు పెరుగుతూనే ఉన్నారు. అయితే ముంబై, చెన్నై, బెంగళూరు, కోచి నుంచి వచ్చి ఇక్కడ స్టార్ డం తెచ్చుకున్న కొందరు హీరోలు హీరోయిన్లు ఇంకా స్పందించనే లేదు. ఇచ్చే తీరాలన్న రూల్ లేదు కానీ ఇలాంటి సమయంలో అభిమానులు వాటిని కనీస స్థాయిలో ఆశించడం సహజం. ప్యాన్ ఇండియా ప్రమోషన్ల పేరుతో హైదరాబాద్ లో పదుల కొద్దీ ఈవెంట్లు చేసే కోలీవుడ్ హీరోల జాడే లేదు. మనం మాత్రం చెన్నై మునిగినా త్రివేండ్రం వరదలో తేలినా డబ్బులు ఇచ్చేస్తాం. అందుకే అనేది తెలుగు చిత్ర సీమకు సాటి వచ్చేవారు లేరు కనిపించరు.