కొడుకు హీరో.. తండ్రి దర్శకత్వం

ఇండియన్ సినిమాలో డబ్బింగ్ చెప్పడంలో గొప్ప నైపుణ్యం ఉన్న కళాకారులు ఎంతోమంది ఉన్నారు. కానీ అందులో మిగతా వాళ్లందరూ ఒకెత్తయితే.. రవిశంకర్ మరో ఎత్తు. ‘అరుంధతి’ సినిమాలో పశుపతి సహా ఎన్నో పాత్రలకు తన గాత్రంతో ప్రాణం పోసిన అరుదైన డబ్బింగ్ ఆర్టిస్ట్ రవిశంకర్. ‘రేసుగుర్రం’ చిత్రంలో విలన్ రవి కిషన్‌తో పాటు ఆయన తండ్రిగా కనిపించే ముఖేష్ రుషికి, హీరో అన్న పాత్రలో నటించిన కిక్ శ్యామ్‌కు.. ఇలా మూడు పాత్రలకు వాయిస్ మార్చి డబ్బింగ్ చెప్పిన అరుదైన ఘనత రవికిషన్‌కే సొంతం.

ఐతే రవిశంకర్ నైపుణ్యం కేవలం డబ్బింగ్‌కే పరిమితం కాదు. నటుడిగానూ ఆయనకు మంచి పేరుంది. అలాగే రచన, దర్శకత్వంలోనూ ప్రవేశం ఉంది. తెలుగులో ‘నరసింహుడు’గా రీమేక్ అయిన కన్నడ సూపర్ హిట్ మూవీ ‘దుర్గి’కి రచయిత, దర్శకుడు రవిశంకరే.

ఆ సినిమా పెద్ద హిట్ అయినా.. మళ్లీ ఎందుకో డైరెక్షన్ చేయలేదు రవిశంకర్. ఐతే సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు రవిశంకర్ మళ్లీ మెగా ఫోన్ పడుతున్నాడు. తన కొడుకు అద్వయ్‌ను హీరోగా పరిచయం చేస్తూ రవిశంకర్ ‘సుబ్రహ్మణ్య’ అనే సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ మూవీ గురించి ఈ రోజే అనౌన్స్‌మెంట్ వచ్చింది. దీని ప్రి లుక్ పోస్టర్ చూస్తే భారీ సినిమాలాగే కనిపిస్తోంది. కేజీఎఫ్, సలార్ చిత్రాల సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తుండడం విశేషం. తిరుమల రెడ్డి, అనిల్ కడియాల పెద్ద బడ్జెట్లో ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

తన కొడుకును అరంగేట్రంలోనే పాన్ ఇండియా హీరోను చేయాలని ప్లాన్ చేసుకున్నాడు రవిశంకర్. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మళయాళ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. మరి దర్శకుడిగా రవిశంకర్ మళ్లీ విజయవంతం అవుతాడా.. తన కొడుక్కి అరంగేట్రంలోనే మంచి హిట్ అందిస్తాడా అన్నది చూడాలి.