పొద్దు పొద్దున్నే నాని హంగామా

సినిమా సినిమాకూ నేచురల్ స్టార్ నాని రేంజ్ పెరిగిపోతోంది. గత ఏడాది ‘దసరా’ మూవీకి వచ్చిన ఓపెనింగ్స్ చూసి నాని జస్ట్ మిడ్ రేంజ్ స్టార్ కాదనే విషయం అర్థమైంది. అంత ఊర మాస్ మూవీ తర్వాత ‘హాయ్ నాన్న’ లాంటి పక్కా క్లాస్ మూవీతోనూ సూపర్ హిట్ కొట్టిన ఘనత నాని సొంతం.

ఇప్పుడు ‘సరిపోదా శనివారం’ మూవీతో ఇటు మాస్, అటు క్లాస్.. రెండు వర్గాలనూ అలరించేలా కనిపిస్తున్నాడు నాని. ఈ చిత్రానికి ప్రేక్షకుల్లో బంపర్ క్రేజ్ కనిపిస్తోంది. రిలీజ్ దగ్గర పడేకొద్దీ హైప్ ఇంకా పెరుగుతోంది. చిత్ర బృందం కూడా సక్సెస్ మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. ప్రేక్షకుల్లో ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ‘సరిపోదా శనివారం’ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో అదనపు షోలు వేయాలని.. పొద్దు పొద్దున్నే షోలు ప్లాన్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

మామూలుగా పెద్ద హీరోల సినిమాలకు మాత్రమే ఉదయం 6-7 మధ్య షోలు పడుతుంటాయి. మిడ్ రేంజ్ హీరోలకు ఈ షోలు పడడం తక్కువే. నానికైతే సోలో హీరోగా ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో ఐదో షో పడడం దాదాపు లేదనే చెప్పాలి. ఐతే ‘సరిపోదా శనివారం’ చిత్రానికి మంచి హైప్ కనిపిస్తున్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఐదో షోకు అనుమతులు తెచ్చుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో పొద్దు పొద్దున్నే షోలు మొదలుపెట్టాలని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు డిసైడైనట్లు సమాచారం.

రేపటికల్లా అనుమతులు వచ్చేస్తాయని.. సోమవారం నుంచి బుకింగ్స్ కూడా మొదలుపెట్టేస్తారని సమాచారం. మామూలుగా శుక్రవారం కొత్త చిత్రాలు రిలీజవుతుంటాయి. ‘సరిపోదా శనివారం’ చిత్రాన్ని మాత్రం గురువారమే రిలీజ్ చేస్తున్నారు. మంచి టాక్ రావాలే కానీ.. లాంగ్ వీకెండ్ అడ్వాంటేజీని ఉపయోగించుకుని ఈ సినిమా ఊహించని స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టి నాని కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలవడం ఖాయం. ‘అంటే సుందరానికీ’ దర్శకుడు వివేక్ ఆత్రేయ రూపొందించిన ఈ చిత్రంలో ఎస్.జె.సూర్య విలన్‌గా నటించగా.. ప్రియాంక మోహన్ కథానాయికగా చేసింది.