ఓపికతో గెలుస్తున్న న్యాచురల్ స్టార్

ఒక సినిమా పూర్తి చేయడం కన్నా దాన్ని సరైన రీతిలో ప్రమోట్ చేసుకుని ఆడియన్స్ దాకా తీసుకెళ్లడం పెద్ద సవాల్ గా మారుతోంది. స్టార్ హీరో ఉన్నా సరే గుడ్డిగా ఓపెనింగ్స్ ఇచ్చే మూడ్ లో ప్రేక్షకులు లేరు. ఖచ్చితంగా థియేటర్ కు వెళ్లాలనిపించే కంటెంట్ ఉందని వింటేనే కదులుతున్నారు. నాని ఈ సూత్రాన్ని బాగా వంటబట్టించుకున్నాడు. ఆగస్ట్ 29 విడుదల కాబోతున్న సరిపోదా శనివారం కోసం ఏకంగా మూడు రోజులు చెన్నైలో మకాం పెట్టి అడిగిన వాళ్లందరికీ ఇంటర్వ్యూలు ఇచ్చి, ప్రెస్ మీట్లు నిర్వహించి, కోలీవుడ్ కబుర్లు పంచుకుని ఇలా ఎన్నో విధాలుగా తమిళ మీడియాలో హైలైట్ అయ్యాడు.

చెన్నై బీచ్ లో ఎస్జె సూర్యతో నడవడంతో మొదలుపెట్టి ఎఫ్ఎం రేడియో స్టేషన్ లో ఆర్జెతో కూర్చుని కబుర్లు పంచుకునే దాకా ఎన్నో చేస్తున్నాడు. తాజాగా కేరళ పబ్లిసిటీ కోసం కోచి వెళ్ళిపోయాడు. హీరోయిన్ ప్రియాంకా మోహన్, విలన్ ఎస్జె సూర్య నాని ఎక్కడికి వెళ్లినా తోడుగా ఉంటున్నారు. నిర్మాత డివివి దానయ్య సీన్లో లేకపోయినా, చివరి నిమిషం పనుల వల్ల దర్శకుడు వివేక్ ఆత్రేయ కనిపించలేకపోయినా భారం మొత్తం నాని సింగల్ గా మోస్తున్నాడు. తమిళనాడు, కేరళకు వెళ్ళడానికి ముందే వీలైనన్ని తెలుగు ఇంటర్వ్యూలు ఇచ్చిన నాని తిరిగి వచ్చాక మరిన్ని ప్లాన్ చేయబోతున్నాడు.

చెప్పాలంటే ఒక హీరో ప్రమోషన్ చేయాల్సిన పద్దతి ఇదే. కొత్త సినిమాల షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నా ప్రత్యేకంగా టైం కేటాయించుకుని మరీ వివిధ ప్రాంతాలకు వెళ్లడం నిర్మాతలకు ఎంతో మేలు చేస్తుంది. సరిపోదా శనివారం ఏదో విఎఫెక్స్ తో తీసిన విజువల్ గ్రాండియర్ కాదు. ఒక విభిన్నమైన పాయింట్ తో రూపొందిన కమర్షియల్ యాక్షన్ డ్రామా. కంటెంట్ మీద నమ్మకంతో నాని ఎంత దూరమైనా ప్రయాణం చేసి ప్రేక్షకులను చేరుకుంటున్నాడు. ఇలా మరికొందరు స్టార్లు చేస్తున్నారు కానీ అందరూ చేస్తే థియేటర్లకు జనాన్ని రప్పించేందుకు మన వంతు కృషి చేసినట్టు అవుతుంది.