షూట్ లేకున్నా ప్రభాస్ ఫౌజి సెట్లోనే

ప్ర‌భాస్ సినిమా అంటే చాలు.. హైప్‌కు ఏమీ లోటు ఉండ‌దు. రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డేకొద్దీ అభిమానుల‌తో పాటు సామాన్య ప్రేక్ష‌కుల్లోనూ అంచ‌నాలు పెరిగిపోతాయి. అందులోనూ ఈసారి హ‌ను రాఘ‌వ‌పూడి లాంటి అభిరుచి ఉన్న ద‌ర్శ‌కుడితో ప్ర‌భాస్ జ‌ట్టు క‌ట్ట‌డంతో త‌న కొత్త చిత్రం ఫౌజిపై అంచ‌నాలు ముందు నుంచే భారీగా ఉన్నాయి. ఆ సినిమా గురించి మేక‌ర్స్ చెబుతున్న మాట‌లు ఆ అంచ‌నాలు మ‌రింత పెంచేలా ఉన్నాయి.

తాజాగా త‌మ బేన‌ర్లో తెర‌కెక్కిన కొత్త చిత్రం ఇరుముడి ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో మైత్రీ మూవీ మేక‌ర్స్ అధినేత ర‌విశంక‌ర్.. ఫౌజి గురించి చెప్పిన ముచ్చ‌ట్లు ప్ర‌భాస్ అభిమానుల్లో ఆ సినిమాపై ఎగ్జైట్మెంట్‌ను పెంచాయి.
స్పిరిట్ మూవీ నుంచి బ్రేక్ తీసుకుని ప్ర‌భాస్ వ‌రుస‌గా నెల రోజుల పాటు ఫౌజి షూటింగ్‌లో పాల్గొంటున్న‌ట్లు ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

ఈ విష‌యాన్ని ధ్రువీక‌రిస్తూ.. ప్ర‌భాస్ ఉద‌యం 8 నుంచి సాయంత్రం 6.30 వ‌ర‌కు ప్ర‌తి రోజూ ఫౌజి షూట్లోనే ఉంటున్న‌ట్లు ర‌విశంక‌ర్ తెలిపారు. ఈ మంగ‌ళ‌వారం అయితే త‌న వ‌ర్క్ ఏమీ లేక‌పోయినా ప్ర‌భాస్సెట్‌కు వ‌చ్చి మానిట‌ర్ ద‌గ్గ‌రే కూర్చుని జాగ్ర‌త్త‌గా అన్నీ చూసుకుంటున్న‌ట్లు ర‌విశంక‌ర్ తెలిపారు.

ఫౌజి విష‌యంలో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ తేడా జ‌ర‌గ‌ద‌ని, సినిమా వేరే లెవెల్లో ఉంటుంది, ఇది నేను భీమ‌వ‌రంలో చేస్తున్న ప్రామిస్ అని ఆయ‌న చెప్ప‌డంతో ఇరుముడి ఈవెంట్ హోరెత్తిపోయింది. ప్ర‌భాస్ స‌ర‌స‌న ఇమాన్వి న‌టిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబ‌రు 3న రిలీజ్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ముందు ఈ డేట్ ప్ర‌క‌టించిన‌పుడు అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యాయి కానీ.. ఆ డేట్‌కు ప‌క్కాగా సినిమాను విడుద‌ల చేయాల‌ని టీం ప‌ట్టుద‌ల‌తో ఉన్న‌ట్లే క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ శివార్ల‌లోని అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో వేసిన ఛార్మినార్ సెట్లో ఈ మూవీ యాక్ష‌న్ ఘ‌ట్టాల చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది.