మహేష్ రీరిలీజ్ మేనియా.. అప్పుడు ఇప్పుడు

టాలీవుడ్లో రెండేళ్లుగా రీ రిలీజ్ మేనియా ఎలా నడుస్తోందో తెలిసిందే. ఐతే ఈ ట్రెండుకు తెర తీసింది మహేష్ బాబు అభిమానులే. 2022లో మహేష్ మూవీ ‘పోకిరి’ని తమ హీరో పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ షోలుగా వేసుకున్నారు ఫ్యాన్స్.

ఐతే ఇలా పాత సినిమాలను హీరోల పుట్టిన రోజులకు రీ రిలీజ్ చేసే సంప్రదాయం ఇప్పటిది కాదు. కానీ ఏవో ఒకట్రెండు షోలు హైదరాబాద్ లాంటి చోట్ల వేయడం మామూలే కానీ.. కొత్త సినిమాల తరహాలో వందల షోలను తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి సిటీ, ప్రతి టౌన్లో వేసి.. థియేటర్ల దగ్గర సందడి చేయడం.. టికెట్లు పెద్ద ఎత్తున అమ్ముడవడం.. రిలీజ్ రోజు థియేటర్లలో నానా హంగామా చేయడం ఇదంతా రెండేళ్ల కిందట మహేష్ ఫ్యాన్స్‌తోనే మొదలైంది. ఆ తర్వాత ఇదొక ట్రెండుగా మారింది. ‘పోకిరి’ అప్పట్లో కోటిన్నరకు పైగా కలెక్ట్ చేయడం సంచలనం రేపింది.

గత రెండేళ్లలో పదుల సంఖ్యలో పాత సినిమాలు రీ రిలీజయ్యాయి. వాటిలో కొన్ని చిత్రాలకు క్రేజీ కలెక్షన్లు వచ్చాయి. ఐతే ఈ మధ్య రీ రిలీజ్‌ల హడావుడి తగ్గింది. అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లు ఈ వ్యవహారం కూడా ఓవర్ డోస్ అయిపోయింది. కొందరు స్టార్ల సినిమాల రీ రిలీజ్‌కు కనీస స్పందన కరవైంది. ఇలాంటి టైంలో మళ్లీ మహేష్ సినిమాతో ఈ ట్రెండు తిరిగి ఊపందుకుంటోంది.

ఈసారి మహేష్ పుట్టిన రోజు కానుకగా ‘మురారి’ లాంటి క్లాసిక్‌ను 4కేలో రీ రిలీజ్ చేస్తున్నారు. దీనికి కొన్ని వారాల ముందే హైప్ మొదలైంది. రెండు రోజుల కిందటే బుకింగ్స్ మొదలయ్యాయి. ఇలా పెట్టడం ఆలస్యం అలా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. అప్పుడే ఈ చిత్రం ప్రి బుకింగ్స్‌తో కోటి రూపాయల గ్రాస్ మార్కును దాటేసింది. రిలీజ్ టైంకి ప్రి సేల్స్ మాత్రమే రూ.2 కోట్ల మార్కును అందుకుంటాయని అంచనా. ఇది చూసి రీ రిలీజ్ విషయంలో మహేష్ మేనియానే వేరు అని అభిమానులు కొనియాడుతున్నారు. మహేష్ పుట్టిన రోజుకు ‘ఒక్కడు’ సినిమా సైతం రీ రిలీజవుతుండడం విశేషం.