క్లాష్ కారణం వివరించిన హరీష్ శంకర్

ఆగస్ట్ 15 విడుదల తేదీని ముందు ప్రకటించుకున్న డబుల్ ఇస్మార్ట్ తో తలపడుతూ మిస్టర్ బచ్చన్ అదే డేట్ తీసుకోవడం గురించి అభిమానుల్లో, ఇండస్ట్రీలో వాడి వేడి చర్చలు జరుగుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే ఇలా క్లాష్ అవుతున్నారనే కోణంలో ఫ్యాన్స్ పరస్పరం ట్రిగ్గర్ చేసుకోవడం కనిపిస్తోంది. దానికి తోడు ఛార్మీ హరీష్ శంకర్, రవితేజ ఇద్దరినీ ఇన్స్ టాలో ఆన్ ఫాలో చేసిందనే వార్త మరింత వేడిని రాజేసింది. ఇవాళ జరిగిన మిస్టర్ బచ్చన్ టీజర్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు స్వయంగా క్లారిటీ ఇచ్చి దీని వెనుక ఎవరున్నారో వివరించి మరీ సందేహాలకు చెక్ పెట్టేశారు.

హరీష్ శంకర్ చెప్పిన వెర్షన్ ఇలా ఉంది. మిస్టర్ బచ్చన్ ముందు ఆగస్ట్ 15 ఆప్షన్ పెట్టుకోలేదు. ఎప్పుడైతే పుష్ప 2 వాయిదా పడిందో మైత్రి డిస్ట్రిబ్యూషన్ తరఫున వాటి వ్యవహారాలు చూసుకునే శశి ఒత్తిడి చేసి ఈ డేట్ ని తీసుకోమని చెవిలో జోరీగలాగా పోరు పెట్టేశారు. అప్పటిదాకా కొంత రిలాక్స్ గా ఉన్న రవితేజ టీమ్ ఒక్కసారిగా అలెర్ట్ అయిపోయి పనులు వేగవంతం చేసింది. దీనికి తోడు ఫైనాన్స్ కు సంబంధించిన వ్యవహారాలు, ఓటిటి ఇష్యూస్ సమస్యని మరింత జటిలం చేశాయి. ఈ పరిణామం వల్ల తొలుత అనౌన్స్ మెంట్ ఇచ్చిన డబుల్ ఇస్మార్ట్ తో ఢీ కొనక తప్పని పరిస్థితి నెలకొంది.

దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో డబుల్ ఇస్మార్ట్ తో మిస్టర్ బచ్చన్ ఫేస్ టు ఫేస్ నిలబడక తప్పలేదు. పూరి జగన్నాధ్ మీద అపారమైన గౌరవాన్ని చెప్పిన హరీష్ శంకర్ ఎప్పటికీ ఆయన స్థాయి స్థానం వేరని ఇదంతా అనుకోకుండా జరిగిందని కుండ బద్దలు కొట్టేశారు. ఏది ఏమైనా కల్కి 2898 ఏడి తర్వాత పెద్ద హీరోల సినిమాలు రాలేదని ఫీలవుతున్న మూవీ లవర్స్ కు కనువిందు చేసేందుకు ఇండిపెండెన్స్ డేకి పలు చిత్రాలు సిద్ధం కావడం ఆసక్తి రేపుతోంది. ఆయ్ లాంటి చిన్న బడ్జెట్ మూవీ కూడా తగ్గేదేలే అనడం చూస్తే ఇది ఆ డేట్ ని అందరూ ఎంత సీరియస్ గా తీసుకున్నారో అర్థమవుతుంది.