‘ఇంద్ర’ వస్తున్నాడు : నెరవేరిన ఫ్యాన్స్ కోరిక

పాత సినిమాల రీ రిలీజ్ ట్రెండ్ మొదలయ్యాక మెగా ఫ్యాన్స్ తో పాటు మాస్ ఆడియన్స్ కోరుకున్న బ్లాక్ బస్టర్ ఇంద్ర. థియేటర్లో ఎప్పుడో 22 సంవత్సరాల క్రితం చూసిన యుఫోరియాని మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద ఎంజాయ్ చేయాలని ఎదురు చూస్తున్న అభిమానుల కోరిక నెరవేరుస్తూ వైజయంతి సంస్థ ఇవాళ అధికారిక ప్రకటన ఇచ్చింది. ఈ బ్యానర్ 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమాని ఆగస్ట్ 22 థియేటర్లకు తీసుకొచ్చే ప్రణాళికలో అశ్వినిదత్తుగారు ఉన్నారని కొన్ని వారాల క్రితమే మా సైట్ బహిర్గత పరిచిన సంగతి తెలిసిందే. చిరు పుట్టినరోజుని దానికి ఎంచుకున్నారు.

ఇప్పుడదే నిజమై ఘనంగా పునఃవిడుదల చేయబోతున్నారు. నిజానికి రీ రిలీజ్ ట్రెండ్ ఈ మధ్య కొంత నెమ్మదించినట్టు కనిపిస్తున్నా ఆగస్ట్ 22 నాటికి పరిస్థితిలో మార్పు వస్తుంది. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ ఒక సెలబ్రేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. జనసేన గెలిచాక అలాంటి వేదిక దొరకలేదు. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రావడానికి ఇంకా టైం పడుతుంది. పవన్ కళ్యాణ్ కు ఈ ఏడాది రిలీజ్ లేనట్టే. ఇతర మెగా హీరోలవి ఏవీ రెడీగా లేవు. ఇంద్రకు ఇంతకన్నా మంచి అవకాశం ఏముంటుంది. అందులోనూ ఇప్పుడు కుర్రాళ్లుగా ఉన్న ఫ్యాన్స్ అప్పట్లో ఇంద్రని పెద్దతెరమీద మిస్ అయినవాళ్లే.

కల్కి 2898 ఏడి బ్లాక్ బస్టర్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న దత్తు గారి బృందానికి మరో జాక్ పాట్ అనే చెప్పాలి. గత పాతికేళ్లలో చిరంజీవి మాస్ సినిమాల్లో నెంబర్ వన్ ఏదంటే అభిమానులు చెప్పే పేరు ఇంద్ర. భారీ నిర్మాణం, బి గోపాల్ దర్శకత్వం, మణిశర్మ పాటలు, రాయలసీమ ఫ్యాక్షన్, వీణ స్టెప్, షౌకత్ అలీఖాన్ ఎపిసోడ్, సీమలో విజిల్స్ వేయించే సన్నివేశాలు ఇదంతా రిపీట్ స్టఫ్ గా విపరీతంగా అలరించిన అంశాలు. ఇవన్నీ మరోసారి ఈలలు గోలలు మధ్య చూడటం కన్నా ఫ్యాన్స్ కోరుకునేది ఏముంటుంది. అప్పుడే సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన హంగామా మొదలైపోయింది.