జాన్వి గురించి తప్పుగా మాట్లాడలేదు

8 ఏఎం మెట్రో సహా మంచి మంచి సినిమాలు.. క్రేజీ వెబ్ సిరీస్‌ల్లో నటించి మంచి పేరు సంపాదించిన బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య. కొత్త తరంలో బాలీవుడ్‌కు దొరికిన మంచి నటుడిగా అతను పేరు సంపాదించాడు. అతను తాజాగా జాన్వి కపూర్ లాంటి క్రేజీ యంగ్ హీరోయిన్‌తో కలిసి ‘ఉలఝ్’ అనే వెరైటీ మూవీలో నటించాడు. త్వరలోనే అది ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఐతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో గుల్షన్.. జాన్వి గురించి చేసిన కామెంట్ చర్చనీయాంశం అయింది. ఈ సినిమా షూటింగ్ టైంలో జాన్వి తనతో అంటీ ముట్టనట్లు ఉండేదని.. కేవలం సన్నివేశాల చిత్రీకరణ టైంలో తప్ప తనతో మాట్లాడేదే కాదని.. తన తీరు ఆశ్చర్యం కలిగించిందని గుల్షన్ పేర్కొన్నాడు. ఈ విషయం చర్చనీయాంశంగా మారడంతో మళ్లీ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చాడు గుల్షన్.

“జాన్వి గురించి నేను తప్పుగా మాట్లాడలేదు. మా ఇద్దరి మధ్య స్నేహం లేదు అని మాత్రమే అన్నాను. అది మా ఇద్దరి తప్పు కాదు. ఆమె మంచి నటి. ప్రొఫెషనల్‌గా నటిస్తుంది. మా ఇద్దరి మద్య సన్నివేశాలు బాగా వచ్చాయి. చేసే ప్రతి సినిమా సెట్లోనూ చిత్ర బృందమంతా కలిసి పోవాలని నిబంధన ఏమీ లేదు కదా. నేనిక్కడ ఎవరినీ కించపరచడం లేదు. ఉద్దేశపూర్వకంగా ఎవరి గురించీ తక్కువగా మాట్లాడలేదు.

సినిమా కోసం వంద శాతం చేయాల్సింది చేశాం. దర్శకుడు చెప్పినట్లు నటించాం. నేను గతంలో చాలా మంది హీరోయిన్లతో కలిసి నటించాను. రాధికా ఆప్టే, సోనాక్షి సిన్హా లాంటి వాళ్లతో కలిసి నటించడాన్ని మరిచిపోలేను. మేం సెట్స్‌లో ఎన్నో విషయాలు చర్చించుకునేవాళ్లం. కానీ జాన్వితో సినిమా గురించి మాత్రమే మాట్లాడాను. మా ఇద్దరి మధ్య వ్యక్తిగత స్నేహం ఏమీ ఏర్పడలేదు. ఇదే విషయాన్ని ఇంటర్వ్యూలో చెప్పా. అంతకుమించి ఇందులో వివాదం ఏమీ లేదు” అని గుల్షన్ వివరించాడు.