బావ‌మ‌రిది సినిమాపై తార‌క్ లైట్

ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి ఓ కొత్త హీరో వ‌స్తున్నాడంటే.. ఆ కుటుంబంలోని ప్ర‌ముఖులు వ‌చ్చి అత‌ణ్ని ప్ర‌మోట్ చేయ‌డం మామూలే. కానీ జూనియ‌ర్ ఎన్టీఆర్ మాత్రం త‌న బావ‌మ‌రిది నార్నె నితిన్‌ను ప్ర‌మోట్ చేయ‌డానికి కెమెరా ముందుకు రాలేదు. నితిన్ తొలి చిత్రం మ్యాడ్ రిలీజ్ టైంలో తార‌క్ త‌న బావ‌మ‌రిది గురించి ఒక వీడియో బైట్ కూడా ఇవ్వ‌లేదు. సితార ఎంట‌ర్టైన్మెంట్స్ లాంటి పేరున్న బేన‌ర్లో చేసిన ఆ సినిమాలో విష‌యం ఉండ‌డంతో మ్యాడ్ బాగా ఆడింది.

ఇప్పుడు గీతా ఆర్ట్స్ లాంటి మ‌రో పెద్ద బేన‌ర్లో ఆయ్ అనే సినిమా చేస్తున్నాడు నితిన్. ఈ సినిమాను కూడా ఎన్టీఆర్ ఏమీ ప్ర‌మోట్ చేయ‌డం లేదు. తెర వెనుక ఉండి సినిమాలు సెట్ చేయిస్తున్నాడేమో కానీ.. మీడియా, సోష‌ల్ మీడియాలో మాత్రం త‌న బావ‌మ‌రిదిని తార‌క్ ప్ర‌మోట్ చేయ‌ట్లేదు.

ఇక ఆయ్ సినిమాకు సంబంధించి క‌థ‌, నితిన్ పాత్ర గురించి తార‌క్‌తో మాట్లాడాల‌ని ట్రై చేసినా.. అత‌ను త‌మ మీద న‌మ్మ‌కంతో అన్నీ త‌మ‌కే వ‌దిలేసిన‌ట్లు చెప్పారు అల్లు అర‌వింద్. పెద్ద కుటుంబం నుంచి వ‌చ్చిన కుర్రాడితో సినిమా తీస్తున్నాం క‌దా అని తార‌క్‌కు తాను ఫోన్ చేశాన‌ని.. ఐతే ఈ సినిమా క‌థ బాగుంద‌ని నితిన్ త‌న‌కు చెప్పాడ‌ని.. క‌థ బాగుంటే చాల‌ని.. అంతా తాము చూసుకుంటామ‌న్న న‌మ్మ‌కంతో తార‌క్ ఈ సినిమా చేసేయండి అని మాత్రమే చెప్పాడ‌ని అర‌వింద్ తెలిపారు.

సినీ ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన హీరోకు తొలి సినిమా వ‌ర‌కు కొంత ప్రోత్సాహం అందించి పుష్ చేయ‌గ‌ల‌మ‌ని.. కానీ ఆ త‌ర్వాత అంతా త‌న ప్ర‌తిభ‌తోనే నెట్టుకురావాల‌ని.. నితిన్ విష‌యంలో కూడా తాను అదే ఆశిస్తున్నాన‌ని తార‌క్ చెప్పిన‌ట్లు అర‌వింద్ వెల్ల‌డించారు. త‌న బావ‌మ‌రిదిని అదే ప‌నిగా ప్ర‌మోట్ చేసి జ‌నం మీద రుద్దాల‌ని చూడ‌క‌పోవ‌డంలో ఎన్టీఆర్ ఆలోచ‌న‌ను మెచ్చుకోవాల్సిందే.