మణిశర్మ మాస్ బయటికి తెచ్చిన పూరి

మెలోడీ బ్రహ్మగా పేరున్న మణిశర్మ మాస్ పాటలను ఇవ్వడంలోనూ ఆయనకాయనే సాటి. టాలీవుడ్ అగ్ర హీరోలందరికీ బ్లాక్ బస్టర్లిచ్చిన అరుదైన ట్రాక్ రికార్డు సొంతం చేసుకున్న ఘనత. చిరు చరణ్, బాలయ్య తారక్ ఇలా ఒకే ఫ్యామిలీలో సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చిన క్రెడిట్ కూడా సొంతం చేసుకున్నారు.

అయితే రెండు దశాబ్దాల సుదీర్ఘ ట్రాక్ రికార్డు ఉన్న మణిశర్మ ఈ మధ్య కాస్త వెనుకబడిన మాట వాస్తవం. ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ అయ్యాక వరసగా అవకాశాలు క్యూ కట్టాయి కానీ మళ్ళీ దాని స్థాయిలో సాంగ్స్ పడలేదు. సినిమాకు ఒకటో రెండో తప్ప మెప్పించినవి పెద్దగా లేవు.

దర్శకుడు పూరి జగన్నాధ్ మరోసారి మణిశర్మలోని మాస్ మ్యూజిక్ డైరెక్టర్ ని బయటికి తీసుకొచ్చారు. టైటిల్ సాంగ్ ఆల్రెడీ ఛార్ట్ బస్టరయ్యింది. తాజాగా రెండో పాట మార్ ముంత చోడ్ చింత పదాలతో వెరైటీ కంపోజింగ్ తో క్రమంగా ఎక్కేసేలా ఉంది.

మధ్యలో కెసిఆర్ స్వంత గొంతులో ఏం చేద్దామంటావ్ ఆడియోని వాడుకోవడం, సోషల్ మీడియా ట్రెండీ పదాలను జొప్పించడం యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. నాటు తెలంగాణ పదాల కాసర్ల శ్యామ్ సాహిత్యం, రాహుల్ సిప్లిగంజ్ కీర్తన శర్మ గాత్రాలు హుషారుతో సాగిపోయాయి. రామ్ ఎనర్జీ, కావ్య గ్లామర్ ఓ రేంజ్ లో పండాయి.

పూరి, మణిశర్మకున్న సింక్ మరోసారి దీని ద్వారా బయట పడింది. పోకిరి నుంచి డబుల్ ఇస్మార్ట్ దాకా ఈ ఇద్దరి కలయికలో వచ్చిన మాస్ పాటలు మ్యూజిక్ లవర్స్ అంత సులభంగా మర్చిపోయేవి కాదు. ఆగస్ట్ 15 విడుదల కాబోతున్న డబుల్ ఇస్మార్ట్ అంచనాలు పెంచే క్రమంలో పూరి చాలా ప్లాన్డ్ గా వెళ్తున్న వైనం కనిపిస్తోంది.

ప్రమోషన్ కంటెంట్ లో మాస్ ని హైలైట్ చేయడం ద్వారా తాను ఎవరి కోసం సినిమా తీశానో స్పష్టంగా చెబుతున్నారు. ఇందులో డ్యూయెట్స్ ఉంటాయట కానీ వాటిని చివర్లో వదులుతారు. ప్యాన్ ఇండియా భాషల్లో డబుల్ ఇస్మార్ట్ భారీ ఎత్తున రిలీజ్ కానుంది.