భారతీయుడు-2 రిలీజ్ వేళ ఒక్కమగాడు ట్రెండింగ్

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బెస్ట్ మూవీస్ లిస్ట్ తీస్తే అందులో ‘భారతీయుడు’ కచ్చితంగా ఉంటుంది. పేరుకు తమిళ చిత్రమే కానీ.. 90వ దశకంలో వచ్చిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పించింది. తెలుగులో ఇక్కడి స్టార్ హీరోల సినిమాలతో సమానంగా భారీ వసూళ్లు రాబట్టింది.

ఆ తర్వాత సౌత్ ఇండియాలో వచ్చిన ఎన్నో భారీ చిత్రాలకు ఈ సినిమా స్ఫూర్తిగా నిలిచిందనడంలో సందేహం లేదు. ఐతే ‘భారతీయుడు’ను అనుకరించే ప్రయత్నం కూడా కొందరు చేశారు. అలాంటి చిత్రాల్లో.. ‘ఒక్క మగాడు’ ఒకటి. ‘భారతీయుడు’ కథనే అటు ఇటు తిప్పి లాగించేశాడు దర్శకుడు వైవీఎస్ చౌదరి.

బాలయ్య, సిమ్రాన్‌ల గెటప్స్ చూసిన ఎవ్వరికైనా ‘భారతీయుడు’ గుర్తుకు రాక మానదు. కానీ సినిమాలో విషయం లేకపోవడం.. సిల్లీ ఎపిసోడ్లు పెట్టడంతో దీన్ని ‘భారతీయుడు’ డూప్‌గా అభివర్ణించారు. రిలీజైన దగ్గర్నుంచి ఆ సినిమాలో సన్నివేశాలు ట్రోల్ మెటీరియల్‌గా మారిపోయాయి.

ఇప్పటికీ తరచుగా ట్రోల్స్ కోసమే ‘ఒక్క మగాడు’ సీన్లను ఉపయోగిస్తుంటారు నెటిజన్లు. ఐతే శుక్రవారం ‘భారతీయుడు-2’ రిలీజ్ సందర్భంగా ఈ సినిమా పేరు ట్రెండ్ కావడం విశేషం. ‘భారతీయుడు-2’ అంచనాలకు ఏమాత్రం తగని విధంగా ఉండడం.. శంకర్ మార్కు పూర్తిగా మిస్ కావడంతో ప్రేక్షకులకు శిరోభారం తప్పలేదు.

శంకర్ కెరీర్లో ఫెయిల్యూర్లు లేవని కాదు కానీ.. ఇంత బోరింగ్‌గా, ఇల్లాజికల్‌గా ఏ సినిమా తీయలేదు. భారతీయుడితో ముడిపడ్డ సీన్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఆ సీన్లు చూసి.. ‘ఒక్క మగాడు’లోని సన్నివేశాలతో వాటిని పోలుస్తున్నారు. శంకర్ తీసింది ‘భారతీయుడు’ సీక్వెల్ కాదు, ‘ఒక్క మగాడు’ సీక్వెల్ అంటూ అంటూ మన నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు.

శంకర్ అసలు ‘భారతీయుడు’ జోలికే వెళ్లాల్సింది కాదని.. తన కల్ట్ మూవీని తనే చెడగొట్టుకున్నట్లు అయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘భారతీయుడు’ సినిమాలో సేనాపతి చనిపోయినట్లుగా కథ ముగిస్తే బాగుండేదని.. అందులో ఆ పాత్రను చావనివ్వకపోవడం వల్లే ఇప్పుడు సీక్వెల్ చేశారని కూడా ఎద్దేవా చేస్తున్నారు నెటిజన్లు.