శంకర్ సినిమాల్లో ఆయన లేని లోటు

ఎంత గొప్ప దర్శకుడైనా ఏదో ఒక దశలో ఫామ్ కోల్పోవడం.. ఔట్ డేటెడ్ అయిపోతున్నాడనే భావన కలిగించడం సహజం. ఐతే తమిళ ఏస్ డైరెక్టర్ శంకర్‌కు ఇప్పుడిప్పుడే అలాంటి దశ వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ‘భారతీయుడు-2’ చూశాక ఆయన పూర్తిగా టచ్ కోల్పోయాడని.. ఔట్ డేట్ అయిపోయాడనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి.

గత దశాబ్ద కాలం నుంచి శంకర్ సినిమాలేవీ అంచనాలను అందుకోవట్లేదు. ‘ఇండియన్-2’ చూశాక శంకర్ పనైపోయిందనే అభిప్రాయం కలుగుతోంది చాలామందిలో. సినిమా చూసిన వాళ్లంతా ఇదేం రైటింగ్, ఇదేం టేకింగ్ అంటూ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా రైటింగ్ దగ్గరే ‘ఇండియన్-2’ తేలిపోయిందన్నది వాస్తవం.

శంకర్ కథల్లో.. సన్నివేశాల్లో ఎప్పుడూ ఉండే బిగి ఇందులో ఎంతమాత్రం కనిపించలేదు. అసలు శంకర్ ఉన్నట్లుండి ఇంత వీక్ ఎలా అయిపోయాడనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. శంకర్‌ను మొదట్నుంచి అనుసరిస్తున్న వారికి ఇక్కడ కనిపిస్తున్న ప్రధాన లోపం.. రైటర్ సుజాత లేకపోవడమే.

తమిళ లెజండరీ రైటర్లలో ఒకడైన రంగరాజన్ కలం పేరు సుజాత. నవలా రచయితగానే కాక స్క్రీన్ రైటర్‌గానూ ఆయనకు గొప్ప పేరుంది. 70వ దశకం నుంచే ఆయన సినిమాలకు రాస్తున్నారు కానీ.. స్క్రీన్ రైటర్‌గా ఎక్కువ పేరొచ్చింది మాత్రం శంకర్ సినిమాలతోనే. శంకర్‌తో ఆయన ప్రయాణం మొదలైందే ‘ఇండియన్’ మూవీతో.

ఆ తర్వాత ఒకే ఒక్కడు, బాయ్స్, అపరిచితుడు, శివాజీ, రోబో సినిమాలకు ఆయన శంకర్‌తో పని చేశారు. ఇందులో ‘బాయ్స్’ మినహా అన్నీ బ్లాక్‌బస్టర్లే. ఐతే రచయితగా మంచి ఫాంలో ఉండగానే 2008లో సుజాత చనిపోయారు. అంతటితో శంకర్ వైభవం కూడా అయిపోయింది. తర్వాత వచ్చిన ఐ, 2.0 సినిమాలు అంచనాలను అందుకోలేకపోయాయి.

ఇప్పుడు ‘ఇండియన్-2’ సంగతి చెప్పాల్సిన పనే లేదు. సాహితీవేత్తగా, రచయితగా మంచి పేరున్న జయమోహన్‌తో 2.0, ఇండియన్-2 సినిమాలకు పని చేయించుకున్నాడు కానీ.. ఆయన సుజాతలా మెరుపులు మెరిపించలేకపోయారు. ఎప్పుడూ కలిసి పని చేసే రచయితను కోల్పోతే ఏమవుతుందో తెలుగులో విజయ్ భాస్కర్ ఒక ఉదాహరణగా నిలిస్తే.. ఇప్పుడు శంకర్ సైతం ఆ లోటును భర్తీ చేసుకోలేక దర్శకుడిగా తడబడుతున్నాడు.