ఇండియన్-2 టీం డ్యామేజ్ కంట్రోల్

తమిళ నటుడు సిద్ధార్థ్ తన సినిమాల ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చి మీడియాను కలిశాడంటే చాలు.. రచ్చ ఖాయం. బేసిగ్గా మీడియా వాళ్లతో ఎప్పుడూ సిద్ధు కొంచెం అగ్రెసివ్‌గానే మాట్లాడుతుంటాడు కానీ.. తెలుగు జర్నలిస్టుల దగ్గరికి వచ్చేసరికి ఆవేశం, వెటకారం ఇంకా పెరిగిపోతుంటుంది. తాజాగా ‘ఇండియన్-2’ ప్రమోషన్లలో భాగంగా జరిగిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో సిద్ధు తీరు వివాదాస్పదమైంది.

ఒక జర్నలిస్టు కమల్‌ను అడిగిన ప్రశ్నకు వెటకారంగా బదులిస్తూ.. కమల్ స్థాయి వ్యక్తిని గొప్ప ప్రశ్నలే వేయాలని, చెత్త ప్రశ్నలు వేయకూడదని పేర్కొనడం విమర్శలకు తావిచ్చింది. అలాగే సినిమా టికెట్ల ధరల పెంపు కోసం వచ్చేవాళ్లు డ్రగ్స్, సైబర్ నేరాలకు వ్యతిరేకంగా ప్రమోషనల్ వీడియోలు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టిన కండిషన్ మీద సిద్ధు కౌంటర్ వేయడం మీద బాగానే వివాదం రాజుకుంది.

ఐతే కొన్ని గంటలు గడిచేసరికి తాను చేసింది తప్పని గుర్తించి.. వివరణ ఇస్తూ ఒక వీడియో రిలీజ్ చేశాడు సిద్ధు. మరోవైపు ‘ఇండియన్-2’ టీం సైతం సిద్ధు చేసిన డ్యామేజ్‌ను కంట్రోల్ చేయడానికి పూనుకుంది. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రమోషనల్ వీడియో చేసి మీడియాకు రిలీజ్ చేసింది. ఇందులో హీరో కమల్ హాసన్, దర్శకుడు శంకర్ సైతం పాల్గొనడం గమనార్హం. ఇందులో సిద్ధు కూడా కనిపించాడు. ఏకంగా ముఖ్యమంత్రి మీదే కౌంటర్ వేయడంతో ఇబ్బంది తప్పదని ఇండియన్-2 టీం భావించినట్లుంది.

ఈ సినిమాకు టికెట్ల ధరలు పెంచుకోవడానికి తెలుగు డిస్ట్రిబ్యూటర్ సురేష్ చూస్తున్నారు. ఇలాంటి టైంలో సిద్ధు చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటే ఇబ్బంది తప్పదని భావించినట్లున్నారు. సీఎం ఇచ్చిన సూచన సమాజానికి మంచి చేసేది కూడా కావడంతో ఈ మేరకు వీడియో చేసి రిలీజ్ చేసినట్లు కనిపిస్తోంది.